అమెరికాలో అన్నవాహిక కేన్సర్ రోగుల సంఖ్య బాగా పెరిగిపోతోంది.ఏడు సంవత్సరాల కాలంలో ఈ రోగుల సంఖ్య రెట్టింపు అయినట్లు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా మధ్య వయస్కుల్లో ఈ కేన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అన్నవాహిక కేన్సర్ రోగుల సంఖ్య అమెరికాలో 50 లక్షల కంటే ఎక్కువగా పెరిగింది.2012 నుంచి 2019 వరకు పెరిగిన రోగుల సంఖ్య చూస్తే 45 నుంచి 64 ఏళ్ళ వరకు ఉన్నవారిలో ఈ కేన్సర్ రెట్టింపు స్థాయిలో పెరిగింది.గొంతు నుంచి పొట్ట పై భాగం వరకు పొడవుగా గొట్టం మాదిరిగా ఉండే అన్నవాహికలో కేన్సర్ లో కణితులు ఏర్పడే ప్రమాదం ఇటీవల కాలంలో బాగా పెరిగినట్లు డైజెస్టివ్ డిసీజ్ వీక్ 2022 మేగజైన్ తెలియచేసింది.
ఎక్కువగా సిగరెట్స్ తాగేవాళ్ళు, మద్యానికి బానిసలైనవారికి అన్నవాహిక కేన్సర్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.ఈ కేన్సర్ వచ్చినవారు ఆహారం తినడం కష్టమై…బాగా బరువు తగ్గిపోతారు.
కేవలం ద్రవాహారం మీదే ఎక్కువగా ఆధారపడతారు.
ప్రపంచ వ్యాప్తంగా మరణానికి కారణమవుతున్న అనేక జబ్బుల్లో అన్నవాహిక కేన్సర్ ఆరో స్థానంలో ఉంది.
ఎండోస్కోపీ ద్వారానే ఈ జబ్బును గుర్తించ గలుగుతారు.సాధారణంగా గొంతు నొప్పిగా ఉన్నా, దగ్గు వస్తున్నా సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల అన్న వాహిక కేన్సర్ గురించి తెలిసే అవకాశం లేదు.
గొంతు నొప్పి ఇన్ ఫెక్షన్ వల్ల వస్తుందనేది తెలిసిందే.కేన్సర్ వ్యాధి తొలి లక్షణం కూడా ఇదే.అందుకే సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల బాగా ముదిరేవరకు తెలియడంలేదు.అందువల్ల చికిత్స తీసుకున్నా మరణాలు సంభవిస్తున్నాయి.
అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా కూడా దీనిపై పరిశోధన నిర్వహించింది.పొగ, మద్యం తాగే అలవాటు ఉన్న మధ్య వయస్కులకు కేన్సర్ పరీక్షలు నిర్వహించుకునే విధంగా ప్రోత్సహించాలని సూచించారు.వయస్సు పైబడిన తెల్లజాతివారిలో ఈ కేన్సర్ సర్వ సాధారణంగా మారిందని పరిశో్ధనల్లో తేలింది.అయితే ముందస్తుగా పరీక్షలు నిర్వహించుకుంటే మరణాన్ని వాయిదా వేయవచ్చని వైద్యులు చెబుతున్నారు.