టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు.ఈ యాత్రకు అనుకున్న మేర జనాల నుంచి స్పందన వస్తోంది .
ఈ యాత్రను అనుకున్న మేర లోకేష్ సక్సెస్ చేస్తే , ఆయనకు ఇక తిరిగి ఉండదని, టిడిపి మరింత బలోపేతం అవుతుందని , 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు.తాను ఇక ఎంతో కాలం ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండలేననే విషయాన్ని గుర్తుపెట్టుకునే లోకేష్ కు తన స్థాయిలో పార్టీలోనూ , జనాల్లోనూ ప్రాధాన్యం ఏర్పడే విధంగా యువ గళం పేరుతో పాదయాత్రకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు .ఈ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలుసుకోవడం, ప్రజల్లోనూ పట్టు పెంచుకోవడం ద్వారా లోకేష్ తిరుగులేని నాయకుడిగా మారుతారని బాబు ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే ఈ యాత్ర చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభమైంది.శ్రీకాకుళం ఇచ్చాపురంలో ముగియబోతోంది.ఈ యాత్ర ముగిసే నాటికి పూర్తిగా లోకేష్ కు అనుకూల పరిస్థితులు పార్టీలోనూ, జనాలలోను ఏర్పడే విధంగా చంద్రబాబు వ్యవహరచన చేస్తున్నారు.
ఇక లోకేష్ పాదయాత్ర మొదటి రోజు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తో పాటు, ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు.పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కానీ చంద్రబాబు మాత్రం ఈ యాత్రకు దూరంగా ఉన్నారు.తాను లోకేష్ యాత్రలో పాల్గొంటే మీడియాతో పాటు, జనాల దృష్టి తనపై ఉంటుందని , లోకేష్ ప్రభావం తగ్గుతుందనే ఉద్దేశంతో బాబు దూరంగా ఉన్నారు.
ఇక లోకేష్ పాదయాత్ర పూర్తయ్యలోపే ఆయన పర్యటించబోయే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించేందుకు బాబు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే 75% నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు చేశారు అలాగే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ను ఖరారు చేశారు.జనసేనతో పొత్తు వ్యవహారం ఉంటే ఏ నియోజకవర్గాలను పొత్తుల భాగంగా కేటాయించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చి మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు.దీని ద్వారా లోకేష్ పాదయాత్ర ఆయా నియోజకవర్గాల్లో ప్రవేశించిన సమయంలో టిక్కెట్ దక్కించుకున్న అభ్యర్థులు భారీగా జన సమీకరణ తో పాటు భారీ ఏర్పాట్లు చేస్తారని బాబు నమ్ముతున్నారు.
అలాగే యువ నాయకులకు ఎక్కువగా టికెట్లు కేటాయిస్తే లోకేష్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని, పార్టీలో లోకేష్ ప్రభావం పెరుగుతుందని బాబు ముందుగానే అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపడుతున్నారట.