టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయాలు ఆషామాషీ వ్యక్తులకు అర్థం కాదు.సమయానుకూలంగా రాజకీయాలు మార్చడం లో చంద్రబాబు దిట్ట.
అందుకే ఆయనను అపర చాణిక్యుడు అని పిలుస్తూ ఉంటారు.కిందపడినా పై చేయి తమదే ఉండాలి అనుకునే రకం.బాబు తెలివితేటల కారణంగానే ఏపీలో టీడీపీ ఘోరంగా దెబ్బతిన్నా, పార్టీ మళ్లీ వేగంగా పుంజుకునేలా చేయడంలో బాబు సక్సెస్ అయ్యారు.వైసీపీ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ, తన రాజకీయ ఎత్తుగడలను అమలు చేస్తున్నారు.
ఇక కేంద్ర అధికార పార్టీ బిజెపి విషయంలోనూ బాబు డబుల్ గేమ్ ఆడుతున్నట్టు గా కనిపిస్తున్నారు.మొదట్లో వైసిపి , బీజేపీ మధ్య స్నేహం ఉండేది.ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ సహకరించుకుంటూ వచ్చేవారు.
ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య విరోధం మొదలైంది.
ఏపీలో వైసీపీ ని దెబ్బతీయడమే లక్ష్యంగా బిజెపి పని చేస్తోంది.ఇక బాబు సైతం బిజెపితో పొత్తు కోసం అన్ని రూట్లలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజ్యసభ సభ్యులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో , వారి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.బిజెపి పొత్తు ఎప్పుడు తమతో పొత్తు పెట్టుకుంటుందా అన్నట్లుగా చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు ఎదురు చూపులు చూస్తున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే కలిసి వచ్చే అంశాలు ఏమిటో చంద్రబాబు కు బాగా తెలుసు.అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిజెపి గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది.2024 ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈ క్రమంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దెబ్బతినాల్సి వస్తుందనే భయం చంద్రబాబుకు ఉంది.కాకపోతే బిజెపి వైసిపి మధ్య బంధం పెరగకుండా, మళ్లీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీ బీజేపీ పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు ఎన్ని రాజకీయాలు చేయాలో, అన్ని చేస్తున్నారు.తాము బిజెపితో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వైసీపీ మాత్రం బీజేపీకి శత్రువు గానే ఉండాలనేది బాబు కోరిక.అప్పుడే తాను అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనే నమ్మకం లో ఉన్నారు.2024 నాటికి అన్ని విధాలుగా వైసిపి బలహీన పడాలి అనేది చంద్రబాబు ఆలోచన.దానికోసమే పొత్తుల విషయం తో పాటు, మిగతా అన్ని విషయాల్లోనూ బాబు క్లారిటీ తోనే ఉన్నారు.