తెలంగాణాలో మహాకూటమి పుణ్యమా అంటూ రాజకీయ బద్ద శత్రువులు… పాత స్నేహితులు ఒకరిని ఒకరు కలుసుకుంటూ… పాత సంగతులు గుర్తుచేసుకుంటున్నారు.ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలయింది.ఆ తరువాత ఆయన టీడీపీలో చేరడం… ముఖ్యమంత్రి అవ్వడం ఇలా ఎన్నెన్నో జరిగిపోయాయి.అయితే… అప్పటి నుంచి కాంగ్రెస్ మీద ఒంటికాలి మీద లేస్తూ … బద్ద శత్రువుగానే విమర్శలు చేస్తూ వస్తున్నాడు.

కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారడం… తెలంగాణాలో టీడీపీ ఉనికి కోల్పోవడంతో తప్పని పరిస్థితుల్లో రాజకీయ అవసరాల నిమిత్తం బాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకున్నారు.పలు సభల్లో పాల్గొని బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.కానీ చంద్రబాబుకి సనత్ నగర్ నియోజక వర్గంలో సత్యం థియేటర్ వద్ద నిర్వహించిన సభలో అనూహ్య పరిణామం ఎదురయ్యింది.

కాంగ్రెస్ మహిళా నేత గంగా భవానీ చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయన మెడలో కాంగ్రెస్ కండువా వేశారు.ముందుగా టీడీపీ కండువాను చాలామంది నాయకులు బాబు మెడలో వేసేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డు చెప్పిన బాబు కాంగ్రెస్ జెండాను మాత్రం ఏమీ అభ్యంతరం చెప్పకుండా వేసుకోవడం విమర్శలపాలవుతోంది.దీనికి సంబందించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది.







