నల్లగొండ జిల్లా: దేశ వ్యాప్తంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులందరికీ ‘అపార్ ఐడీ’( Apaar ID ) అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విద్యాశాఖ ఆ దిశగా చర్యలు చేపట్టింది.వచ్చే జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే అన్ని వర్సిటీలు,కళాశాలల యాజమాన్యాలను ఆదేశాలు జారీచేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ “వన్ నేషన్-వన్ స్టూడెంట్” పేరిట 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ చేయనుంది.అదే అపార్ గుర్తింపు సంఖ్య ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది.
అందులో భాగంగానే అపార్ ఐడీలను రూపొందించడంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అంబేద్కర్ యూనివర్సిటీ.
ఇప్పటికే 75 శాతం అపార్ ఐడీలను క్రియేట్ చేసింది.
విషయాన్ని రెండ్రోజుల క్రితం జాతీయ స్థాయిలో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో రాష్ట్ర కళాశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్ధులకు పూర్తి స్థాయిలో అపార్ ఐడీ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లుతున్నట్లు తెలిపారు.
సాంకేతిక పరమైన సమస్యలు వస్తే నిపుణులు వెంటనే ఆ విద్యార్ధికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ అపార్ ఐడీ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.దీంతో కేంద్ర విద్యా శాఖ డిప్యూటీ సెక్రటరీ రోహిత్ త్రిపాఠి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని అభినందించారు.100 శాతం అపార్ ఐడీలు అతి త్వరలోనే పూర్తిచేసి రికార్డ్ క్రియేట్ చేయాలన్నారు.