సర్వికల్ క్యాన్సర్ గురించి తరచూ ఏదో ఒక వార్త మనం వింటూనే ఉంటాం.ఎందుకంటే దేశంలో సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటం బాధాకరం.
సర్వికల్ క్యాన్సర్లో ప్రపంచంలో భారత్ నాల్గవ స్థానంలో ఉండటం దురదృష్టకరం.ఈ క్రమంలో గర్భాశయ క్యాన్సర్ కు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
అవును, దేశంలోని 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు ఈ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది.మహిళల్లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న సర్వికల్ క్యాన్సర్స్ను నిరోధించేందుకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్టు తెలిపింది.

ఇందులో భాగంగా ఈ సంవత్సరం జూన్లో తొమ్మిది నుండి 14 ఏండ్ల బాలికలకు జాతీయ రోగనిరోధకత కార్యక్రమంలో HPV వ్యాక్సిన్ను కేంద్రం ఇవ్వనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ కార్యక్రమంలో భాగంగా 9-14 ఏండ్ల బాలికలకు ఈ వ్యాక్సిన్ ను ఉచితంగానే వేస్తారు.గర్భాశయ క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకోవడంలో HPV చాలా కీలకమైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు.HPV 16 కోట్ల డోసులకు ఏప్రిల్ లో టెండర్ల ప్రక్రియన నిర్వహిస్తారని భోగట్టా.

కేవలం మన దేశంలోనే ప్రతి సంవత్సరం సర్వికల్ క్యాన్సర్ బారిన పడి 35 వేల మంది స్త్రీలు చనిపోతున్నారని మీకు తెలుసా? అంతేకాకుండా దాదాపు 40% మంది మహిళలు సదరు రోగాన్ని మొదటి దశలో పసిగట్టకపోవడం బాధాకరం.వచ్చింది సర్వికల్ క్యాన్సర్ అని తెలుసుకొనేసరికి పుణ్యకాలం గడిచిపోతుంది.ప్రస్తుతం కేంద్రం చేపట్టబోతున్న ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.ఈ మేరకు ఇప్పటికే దేశంలోని ప్రతి జిల్లాలో 5 నుంచి 10వ తరగతి వరకు బాలికల సంఖ్యను సేకరించి ఆ జాబితాను పంపాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం ఇప్పటికే ఆదేశించింది.
