దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది.ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు.
కేసులో కవితను సీసీ టీవీ పర్యవేక్షణలో ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రతో పాటు ఆమె పొందిన ప్రయోజనాలపై అధికారులు ఆరా తీయనున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టు ఎదుట హాజరుపర్చాలని ఈడీకి రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.అలాగే రిమాండ్ లో కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులను కలిసేందుకు అనుమతించిన కోర్టు కవితకు ఇంటి భోజనానికి అనుమతించింది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మరి కొందరు బీఆర్ఎస్ నేతలు కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
ఈ క్రమంలో కవితను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరడంతో ఆమెకు ఏడు రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.