పూర్తిగా సినిమాలపైనే తన దృష్టి అంత పెట్టి రాజకీయాలతో సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయినా పదే పదే ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రస్తావన వస్తోంది.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను స్వీకరించాలని , పార్టీని ఆయనే అధికారంలోకి తీసుకు రాగలరు అని పదేపదే ఆ పార్టీకి చెందిన వారు ప్రకటనలు చేస్తున్నారు.చంద్రబాబు పని అయిపోయిందని, లోకేష్ పార్టీని నడపలేరని, ఎన్టీఆర్ ఒక్కరే దీనికి సమర్ధుడు అంటూ ఏపీలోనూ అనేక డిమాండ్లను ఆ పార్టీ నేతలు వినిపిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆ పనిని తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా తీసుకున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో టిడిపి యాక్టివ్ కావడం, ఖమ్మంలో భారీ బహిరంగ సభను చంద్రబాబు ఏర్పాటు చేయడం పైన బీఆర్ఎస్ నేతలు వరుసగా విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోని టిడిపిలో కీలకంగా వ్యవహరించి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రస్తుత తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు.తెలంగాణలో టిడిపి బలం పుంజుకునే దశలో ఉందని, పార్టీని వదిలి వెళ్లిన వారంతా మళ్ళీ వెనక్కి రావాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడం, ఇప్పుడు తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉండడానికి కారణం తానేనంటూ చెప్పడంపై మంత్రులు అనేక విమర్శలు చేశారు.
ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు .చంద్రబాబు ఒక విఫల నాయకుడని, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
టిడిపికి ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే టిడిపి అధ్యక్ష బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు ఇచ్చేయాలని, ఏపీ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ ను కోరుకుంటున్నారని, కానీ చంద్రబాబు దొడ్డిదారిలో ఆయన కుమారుడు లోకేష్ ను పార్టీకి అధినేతగా నియమించాలని చూస్తున్నారని మండిపడ్డారు.ఏపీ ప్రజలు చంద్రబాబు లోకేష్ ను తిప్పి కొట్టిన విషయాన్ని గుర్తించుకోవాలని ఎర్రబెల్లి విమర్శించారు.
.