తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది.రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది.
ప్రధాని నరేంద్రమోదీ మొదలు… తెలంగాణలోని ఆ పార్టీ ముఖ్యనేతల వరకు అంతా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నారు.ఇందులోభాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దలు వరుసగా సమావేశమవుతున్నారు.
పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు.తాజాగా ఢిల్లీకి గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లు వెళ్లారు.
వీరితోపాటు ఇతర ముఖ్య నేతలు సైతం ఉన్నారు.ఓవైపు జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.నగరానికి చెందిన బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది.దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది.
తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కమలనాథులు భావిస్తున్నారు.ఈమేరకు నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
ఇక హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందనే విషయాన్ని ప్రధాని లెక్కలతో సహా కార్పొరేటర్లకు చెప్పారని సమాచారం.ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.టీఆర్ఎస్ ఏ రకంగా ఆ నిధులను దుర్వినియోగం చేస్తుందో చెప్పాలని ప్రధాని మోదీ కార్పొరేటర్లకు సూచించారని తెలుస్తోంది.ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కీలక సూచనలు చేశారు ప్రధాని మోదీ.
ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని కార్పొరేటర్లకు సూచించారు.గడచిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటారని కార్పొరేటర్లను మెచ్చుకున్న మోదీ… త్వరలో రానున్న ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునేలా సత్తా చాటాలని సూచించారు.
పార్టీ అండగా ఉంటుందని, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ప్రధాని కార్పొరేటర్లను కోరారు.

మరోవైపు వచ్చే నెలలో హైదరాబాద్లో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలనే ఆలోచనలో ఆ పార్టీ నాయకత్వం ఉంది.కేవలం మొక్కుబడిగా ఈ సమావేశాలు నిర్వహించకుండా.తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతోందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లేలా చేయాలని బీజేపీ యోచిస్తోంది.
ఇందులో భాగంగానే ప్రధాని మోదీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారని తెలుస్తోంది.బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు…జులై 2,3 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్నాయి.
కార్యవర్గ సమావేశాల్లో…దాదాపు 300 మంది ప్రముఖులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, 18మంది బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ నేతలు హాజరుకానున్నారు.
ప్రధాని మోదీ రెండు రోజుల పాటు రాజ్భవన్లోనే బస చేయనున్నారు.రెండు రోజుల పాటు భాగ్యనగరమంతా కాషాయమయం కానుంది.
రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ దూకుడు ఎలా వుండబోతోందో ఇవన్నీ అద్దంపడుతున్నాయి.







