తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తే టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో ఉన్నారనే అనుమానాలు చాలాకాలం నుంచి అందరిలోనూ ఉన్నాయి.తెలంగాణలో రోజురోజుకు బిజెపి బలం పుంజుకుంటూ ఉండటంతో, ఆ బలం మరింత పెరగకముందే ముందస్తు ఎన్నికలకు వెళితేనే మంచిదనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
ఈ విషయంలోనే కేంద్ర అధికార పార్టీ బిజెపి టెన్షన్ పడుతోంది.కచ్చితంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని బిజెపి నేతలు చెబుతున్నారు.
దీన్నిబట్టి చూస్తే తెలంగాణలో ముందస్తు ఎన్నికలను ఎదుర్కొనేందుకు బిజెపి అంత ఆసక్తిగా లేదనే విషయం స్పష్టమవుతుంది.ముందస్తు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా టిఆర్ఎస్ కు అనుకూలంగానే ఫలితాలు వస్తాయని బిజెపి భయపడుతున్నట్లుగా అర్థమవుతుంది.
సాధారణ ఎన్నికల నాటికి బిజెపిని మరింత బలోపేతం చేసి అప్పుడు ఎన్నికలకు వెళ్తే అనుకున్న మేరకు సక్సెస్ అవ్వవచ్చు అని, ముందుగా ఎన్నికలకు వెళ్తే నష్టపోవాల్సి వస్తుందనే భయం బిజెపిలో కనిపిస్తోంది.ప్రస్తుతం టిఆర్ఎస్ మంత్రులు , కీలక నాయకులే టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి.
ఈడి, ఐటి దాడులు చోటు చేసుకుంటూ ఉండటంతో, ఐటీ ఈడీ దాడులతో మంత్రులు, ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు.టిఆర్ఎస్ దాడి చేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్న క్రమంలో, కెసిఆర్ మాత్రం ముందస్తు ఎన్నికల ఆలోచనతోనే ఉండడం, మిగతా పార్టీలకు మింగుడు పడటం లేదు.
బిజెపి ఎంతగా తమను వేధించిన ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామని కేసీఆర్ తరచుగా ప్రకటనలు చేస్తున్నారు.
అయితే కెసిఆర్ ముందస్తు ఆలోచన చేసిన బిజెపి నేతలు చెబుతున్నట్లుగా తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఎవరికి లాభం చేకూరుతుందని ఆసక్తికరంగా మారింది.బిజెపికి ఈ అంశం పెద్దగా కలిసి రాదని టీఆర్ఎస్ కే అది అనుకూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.తెలంగాణలో ఎన్నికలు ఎంత ఆలస్యమైతే, అంతగా బిజెపికి కలిసి వస్తుంది.119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దింపేందుకు అవకాశం ఏర్పడుతుంది.అలా కాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఆ ప్రభావం తమ పార్టీని దెబ్బతీస్తుందనే భయము బిజెపిలో పెరుగుతోంది.
అందుకే కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళకుండా కట్టడి చేసే ప్రయత్నం బిజెపి మొదలుపెట్టింది.