యాదాద్రిభువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం బస్వాపూర్ (నృసింహ) రిజర్వాయర్లో ముంపుకు గురైన నిర్వాసితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని,తమకు న్యాయం చేయాలని కోరుతూ లప్పనాయక్ తండా నిర్వాసితులు బస్వాపూర్ జలాశయం కట్టపై చేపట్టిన దీక్ష మంగళవారం 13వ రోజుకు చేరుకుంది.నష్టపరిహారం,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపుల విషయంలో లప్పనాయక్ తండా ముంపు బాధితులతో మాట్లాడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో బాధితులు వాగ్వాదానికి దిగారు.
దీనితో కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ సమస్య పూర్తికాక ముందే దీక్ష శిబిరం వద్ద నుంచి వెళ్లిపోగా,భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి బాధితులతో చర్చలు జరిపారు.కలెక్టర్ వెళ్లిపోవడంతో ఆగ్రహించిన బాధితులు ప్రాజెక్ట్ పనులను అడ్డగించి,జలాశయ కట్టపై బైఠాయించి,వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లడుతూ ప్రభుత్వం తమకు ప్రకటించిన నష్టపరిహారం,పునరావాస ప్యాకేజీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం నుంచి పరిహారం విడుదలయ్యే వరకు ఈ దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిరసన దీక్షలో గ్రామస్తులు,నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.