తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో ఉన్న రైసు మిల్లర్లకు వత్తాసు పలుకుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.కేంద్రం ఓ పక్క రా రైస్ కొంటామని చెబుతుంటే కేసీఆర్ మాత్రం వేరేలా చెబుతున్నారని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన భాష చాలా జుగుప్సాకరంగా ఉందని అన్నారు.తెలంగాణ లో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా కేసీఆర్ వాడిన భాషను ఉపయోగించరని పేర్కొన్నారు.
ఒక కేంద్ర మంత్రిని పట్టుకుని దద్దమ్మ అని తిట్టడం కేవలం ఆయనకే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కు భయపడి తెలంగాణ మంత్రులు ఆయన భాషను సమర్థిస్తున్నారని తెలిపారు.
అసలు ఏ రాష్ట్రంలో లేని ధాన్యం కొనుగోలు సమస్య తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు.యాసంగిలో కూడా తప్పకుండా ధాన్యం కొనాల్సిందేనని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
రైస్ బ్రాన్ ఆయిల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపిందని కానీ ఎక్కడ ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.తెలంగాణ మిల్లర్లు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.
రైసు మిల్లర్ల అక్రమాలను అరికట్టాల్సిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం సరికాదని ఆయన విమర్శించారు.తెలంగాణలో ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాటన్నింటికీ కేసీఆర్ కారణం కాదా అని ప్రశ్నించారు.రైతు ఆత్మహత్యలతో పాటు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు మరియు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
వీటిపై విచారణలు చేయాలని డిమాండ్ చేశారు.యాసంగిలో తప్పకుండా ధాన్యం కొనాలని స్పష్టం చేశారు.