ఎక్కడికి వెళ్ళినా ఏపీ సీఎం జగన్ ఒకటే చెబుతున్నారు.తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దాదాపు 95 శాతం పూర్తి చేశామని, మేనిఫెస్టోలో హామీలతో పాటు మరెన్నో కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని, ఆర్థికంగా ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, సంక్షేమ పథకాలకు లోటు రానివ్వలేదని చెబుతూ మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నారు.
జగన్ ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి , ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన ఖర్చు , ఆ నియోజక వర్గాల్లో చోటు చేసుకున్న అభివృద్ధి ఇలా అన్నిటిని జగన్ వివరించే ప్రయత్నం చేస్తున్నారు.జనాల కు మాత్రమే కాదు, పార్టీ కార్యకర్తలతో నిర్వహిస్తున్న సమావేశాలలోను జగన్ ఇదే విషయాన్ని చెబుతున్నారు.ఏపీలోని175 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, కార్యకర్తల్లో అసంతృప్తి ,ఎమ్మెల్యేల పనితీరుపైనా, తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే విషయం పైన అసంతృప్తి ఉండడంతో దానిని పోగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.
దీనిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో నుంచి 50 మంది ముఖ్యమైన కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా సమీక్ష చేయడంతో పాటు, అక్కడ చోటు చేసుకున్న అభివృద్ధి, నాయకులకు దక్కిన ప్రాధాన్యం తదితర అంశాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక జిల్లాల పర్యటన సందర్భంగా ను వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధి, గత టిడిపి హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించేందుకు జగన్ ఎక్కువ తాపత్రయపడుతున్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రులను చూసి కాదని, తనను చూసి ఓటు వేయాలంటూ జనాలను కోరుతున్నారు.ఇక కార్యకర్తలకు ఇదే విషయాన్ని చెబుతున్నారు.నాయకుడు ఎవరైనా తనను చూసి పనిచేయాలని, మీ సంగతి తాను చూసుకుంటానని, సరైన సమయంలో సరైన ప్రాధాన్యం ఇస్తామని జగన్ కార్యకర్తలకు హిత బోధ చేస్తున్నారు. గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి జనాల్లోకి వెళ్లి పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీదేనని జగన్ హితబోధ చేస్తున్నారు.
ఏపీలో అభివృద్ధి చేశాం కాబట్టే జనాలను మరోసారి గెలిపించాలని కోరే సాహసం చేస్తున్నామని విషయాన్ని జగన్ పదేపదే ప్రస్తావిస్తున్నారు.ప్రజలు, సొంత పార్టీ నాయకులు ఇలా ఎవరైనా జగన్ మాత్రం తాను ఏపీని అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని, ఆ అభివృద్ధిని చూసే మళ్ళీ తమకు అవకాశం ఇవ్వాలని జగన్ పదే పదే కోరుతున్నారు.