వైసిపి అధినేత సీఎం జగన్( Ap CM Jagan ) వైఖరి మిగతా రాజకీయ నాయకుల కంటే భిన్నంగా ఉంటుంది.చెప్పాలనుకున్నదేదో సూటిగా చెబుతూ ముందుకు వెళ్లడం జగన్ స్టైల్.
తాను చేస్తున్న పని కనిపిస్తే చాలు తాను జనంలో కనిపించకపోయినా పర్వాలేదు అన్న వైఖరితో ఉంటూ ఉంటారు.ఆ విధానం సరైనదే అయినా, రాజకీయాల్లో మాత్రం కొన్ని కొన్ని సార్లు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది .ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలు చాలామంది జగన్ వైఖరితో అసంతృప్తితో ఉన్నారు. దీనికి కారణం వారు జగన్ కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఆయన అపాయింట్మెంట్ దొరకకపోవడం, నియోజకవర్గ సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం లేకపోవడం, జనాలు నుంచి ఆయా సమస్యలపై ఒత్తిడి వస్తుండడం, ఇవన్నీ తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి.
అయినా జగన్ మాత్రం ఈ విషయంలో పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పటికే ప్రభుత్వ పథకాలన్నీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకుల ప్రమేయమే లేకుండా నేరుగా ప్రజలకు అందే విధంగా సాగిపోతున్నాయి.నియోజకవర్గాల్లోనూ తాము నామమాత్రం అయ్యామనే బాధ ఎమ్మెల్యేల్లో నెలకొంది.ఆ బాధ క్రమక్రమంగా పార్టీ పైన, అధినేత జగన్ పైన అసంతృప్తికి కారణం అవుతున్నాయి.
ఇటీవల పార్టీ పైన , వైసిపి ప్రభుత్వం పైన విమర్శలు చేసి జగన్ ఆగ్రహానికి గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Kotamreddy Sridhar Reddy ) వ్యవహారంలోనూ ఇదే జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి .తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా ప్రయోజనం లేకపోవడం, సరిగా అపాయింట్మెంట్ దొరకపోవడం ఇవన్నీ శ్రీధర్ రెడ్డిలో అసంతృప్తిని రాజేశాయి .మూడు తరాలుగా వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడుగా ఉన్న శ్రీధర్ రెడ్డి ఇప్పుడు బద్ధ శత్రువుల మారిపోయారు.ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి( Anam Ramanarayana Reddy ) పరిస్థితి అంతే.
ఆయన తన సీనియారిటీకి తగ్గట్లుగా మంత్రి పదవి ఇవ్వలేదనే అసంతృప్తి ఆయనలో ఉంది.ఇక ఆయన పైన అనుమానాలు పెంచుకోవడం, ఆయన చేసిన చిన్న చిన్న విమర్శలను కూడా సీరియస్ గా తీసుకుని పక్కన పెట్టడం జరిగాయి.
ఈ విధంగా చెప్పుకుంటే వైసిపి ఎమ్మెల్యేల అందరిలోనూ దాదాపు ఇదే రకమైన అసంతృప్తి ఉంది .
కనీసం మూడు నాలుగు నెలలకు ఒకసారి అయినా తమ నియోజకవర్గ సమస్యలను గురించి చెప్పుకునేందుకు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎలా అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యే జగన్ పై అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్ ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తిని పోగొట్టి, నియోజకవర్గాల్లో ని గ్రూపు రాజకీయాలను కట్టడి చేయగలిగితేనే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.