ఆగస్టు నెల వచ్చిందంటే టిడిపి అగ్ర నేతల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగిపోతూ ఉంటాయి.చాలా ఏళ్లుగా ఆగస్టులో టిడిపికి ఏదో ఒక సంక్షోభం రావడం, పార్టీ కుదేలు అవ్వడం ఆనవాయితీగా మారిపోయింది.
పార్టీ కీలక నాయకులు మరణించడమో, రాజకీయంగా తీవ్ర ఇబ్బందులకు గురికావడమో, కీలక నాయకులనుకున్నవారు పార్టీకి రాజీనామా చేయడమో, అంతర్గతంగాను తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోవడం వంటి వ్యవహారాలన్నీ ఆగస్టు నెలలోనే చోటు చేసుకుంటూ వస్తున్న ఘటనలు అనేకం ఆగస్టు నెలలోనే సంభవించాయి.అందుకే ఆగస్టు కు టిడిపికి సంబంధాలు ఉన్నాయి అని అంతా నమ్ముతున్నారు.టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు అధికారంకు దూరమై నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆగస్టు నెలలో టిడిపికి సంక్షోభ కాలంగానే అంతా గుర్తిస్తూ వస్తున్నారు.అంతేకాదు ఎన్టీ రామారావు కు వ్యతిరేకంగా టిడిపిని చంద్రబాబు నాయుడు స్వాధీనం చేసుకునేందుకు తిరుగుబాటు లేవనెత్తింది కూడా ఇదే నెలలో.
అలాగే ఆగస్టు 29న బషీర్బాగ్ వద్ద వామపక్ష ఉద్యమకారులపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కాల్పులు జరిపిన ఘటన , ప్రస్తుతం తెలంగాణ సీఎం గా ఉన్న కేసీఆర్ టిడిపికి రాజీనామా చేసింది ఇదే ఆగస్టు నెలలో.ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఏడాది ఆగస్టులో ఎన్నో సంక్షోభాలను టిడిపి ఎదుర్కొంటూ ఉంది .అయితే ఈ ఆగస్టు నెలలో టిడిపికి సంక్షోభం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రూపంలో తలెత్తిందనే ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కావడానికి మొదట్లో పట్టించుకోనట్టుగా వ్యవహరించిన టిడిపి దీని వెనుక ఉన్న రాజకీయాన్ని అర్థం చేసుకున్న తరువాత ఆందోళన చెందుతోంది.

అయితే అది ఎక్కడా బయటపడకుండా పార్టీ కీలక నాయకులు ఎవరు దీనిపై స్పందించవద్దని అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీచేసినా, కొంతమంది టిడిపి కీలక నాయకులు దీనిపై స్పందిస్తునే ఉన్నారు.ఇక లోకేష్ కు చెందిన సోషల్ మీడియా టీం కూడా జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్ చేస్తూ ఆయనపై విమర్శలు చేస్తున్నారు.బిజెపిపై చంద్రబాబు రాజీ లేకుండా పోరాటం చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా ముందు చేతులు కట్టుకుని కూర్చున్నాడని విమర్శలు లోకేష్ టీం చేస్తుండడంతో, టిడిపిలోనూ చీలిక వచ్చే ప్రమాదం ఉందనే అనుమానాలు పార్టీలోనూ వ్యక్తం అవుతున్నాయి.







