బిడెన్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన తరువాత ఎంతో మంది ఇండో అమెరికన్స్ కు కీలక భాద్యతలు అప్పగించిన విషయం అందరికి తెలిసిందే.గతంలో ఏ ప్రభుత్వం, ఏ అధ్యక్షుడు ఇవ్వని విధంగా సుమారు 130 మందికి పైగా భారత సంతతి వ్యక్తులకు తన ప్రభుత్వంలో పదవులు అప్పగించారు.
చివరికి అధ్యక్షుడి తరువాత కీలకమైన ఉపాధ్యక్ష పదవికి భారత సంతతి మహిళ అయిన కమలా హారీస్ ను ఎంపిక చేసి చరిత్ర సృష్టించారు.కాగా తాజాగా బిడెన్ మరో భారత సంతతి వ్యక్తిని మరో కీలక పదవికి ఎంపిక చేశారు.
ఇండో అమెరికన్ అయిన అటార్నీ అరుణ్ సుబ్రమణియన్ ను అమెరికాలోని న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా నామినేట్ చేశారు.ఎన్నో ఏళ్ళ క్రితమే అరుణ్ తల్లి తండ్రులు భారత్ నుంచీ అమెరికా వలస వెళ్ళారు.
ఆయన చదువు మొత్తం అమెరికాలోనే సాగింది.కొలంబియా స్కూల్ నుంచీ జూరిస్ డాక్టర్ పట్టా తీసుకున్న ఆయన న్యూయార్క్ లోని సుస్మాన్ గాడ్ ఫ్రే లో కీలక భాగస్వామిగా ఉన్నారు.
అలాగే 2006 నుంచీ 2007 వరకూ అంటే ఒక ఏడాది కాలం అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ రూత్ బాడర్ కు లా క్లర్క్ గా పనిచేశారు.గతంలో అంటే.
2005 నుంచీ 2006 వరకూ న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్ లించ్ వద్ద పనిచేశారు.అయితే అరుణ్ పనిచేసినంత కాలం ఎంతో నిబద్దతో పనిచేశారని, ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బిడెన్ ప్రస్తుతం సదరన్ కోర్టు జడ్జి గా నామినేట్ చేశారని తెలుస్తోంది.
కాగా అరుణ్ నామినేషన్ ను ఇప్పటికే వైట్ హౌస్ ధృవీకరించి సెనేట్ ఆమోదం కోసం పంపింది.ఒక వేళ సెనేట్ ఆమోదం తెలిపితే అతి త్వరలో అరుణ్ సుబ్రమణియన్ సదరన్ కోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
అరుణ్ ను నామినేట్ చేసిన బిడెన్ కు భారత సంతతి వ్యక్తులు,సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.