ఎయిడెడ్ విద్యా సంస్థలు ఒకొక్కటిగా మూతపడుతున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 42 కారణంగా పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే కళాశాలలు కనుమరుగవుతున్నాయి.
దీంతో అధిక ఫీజులు చెల్లించలేక ప్రైవేట్ కాలేజీల్లో చదువు కోలేని పేద విద్యార్థులు రోడ్డున పడుతున్నారు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఐడియల్ కాలేజ్ ని మూసి వేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యారంగంలోనే ఐడియల్ కాలేజీ తలమానికంగా నిలిచింది.1972లో స్థాపించిన ఐడియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎయిడెడ్ కళాశాలను ఎయిడెడ్ సొసైటీ పేరుతో ఏర్పాటు చేశారు.ఈ కాలేజీకి విద్యావేత్త, రచయిత డాక్టర్ పి చిరంజీవినీకుమారి కరస్పాండెంట్ గా ఉండేవారు.ఈ సొసైటీ పేరుతోనే డిగ్రీ కాలేజీ కూడా కొనసాగుతుంది.ఒకే క్యాంపస్ లోనే రెండు కాలేజీలు నిర్వహిస్తున్నారు.
ఈ కాలేజీలోనే పీజీ ఇంజనీరింగ్ కోర్సులు కూడా కొనసాగుతున్నాయి.13 ఎకరాల్లో ఉన్న ఈ కాలేజీ యూజీసీ నుంచి నిధులు పొందుతుంది.52 ఏళ్ళ చరిత్ర కలిగిన ఐడియల్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీని మూసివేస్తున్నట్టు కరస్పాండెంట్ చిరంజీవినీకుమారి ప్రకటించారు.ప్రభుత్వ విధానాల కారణంగా మూసేస్తున్నట్టు చెబుతున్నారు.ఈ విద్యాసంవత్సరం నుంచి జూనియర్ కాలేజీ మూసివేయడంతో సుమారు 500 మంది విద్యార్ధులు నష్ట పోతున్నారు.అంతేకాకుండా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కూడా ఉద్యోగాలను కోల్పోతున్నారు.లక్షలాది మంది విద్యార్ధులను తీర్చిదిద్దిన ఎయిడెడ్ జూనియర్ కాలేజీ మూసివేయంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత 5 దశాబ్ధాలుగా కొనసాగుతున్న ఐడియల్ జూనియర్ కాలేజీకి కాకినాడతోపాటు జిల్లా నలుమూలల నుంచి విద్యార్ధులు ఈ కాలేజీ సీటు కోసం పోటీ పడతారు.మాజీ లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి ప్రముఖులు ఈ కాలేజీలోనే చదువుకున్నారు.ఈ కళాశాల అభివృద్ధిలో విద్యార్ధుల పాత్ర కూడా ఉంది.ప్రభుత్వంతో సంప్రదించి తిరిగి కాలేజీని తెరిపించాలని విద్యార్ధి సంఘ నాయకులు కోరుతున్నారు.ఇప్పటికే సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో కాలేజీ మూసివేయడం సరికాదని, వెంటనే ఈ కాలేజీని తెరిపించాలని విద్యార్థులు కోరుతున్నారు.