వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలతో తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్( BRS ) అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే వస్తోంది.ఒకపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడి అధికారులు నోటీసులు ఇవ్వడంతో పాటు , మూడుసార్లు విచారించడం , ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
దీనికి తోడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) పదేపదే విమర్శలు చేస్తున్నారు.
ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్( Minister KTR ) కు సంబంధం ఉందని , ఆయన పిఏ ను విచారించాలంటూ పదేపదే డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్తున్నారు.
ముఖ్యంగా తెలంగాణ బిజెపి శాఖ పేపర్ లీకేజీ వ్యవహారంలో దూకుడుగా ఉంది .విద్యార్థులు, నిరుద్యోగులు , యూనివర్సిటీలను సందర్శించి ప్రజల్లోకి ఈ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని తీసుకువెళ్లి బిఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచి, దాన్ని అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహానికి దిగింది.ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ , కెసిఆర్( KTR, KCR ) లకు సంబంధం ఉందని టీఎస్పీఎస్సీ చైర్మన్ కేటీఆర్ కు దగ్గర బంధువు అని రేవంత్ విమర్శిస్తున్నారు.అన్ని ప్రభుత్వ శాఖల్లో కంప్యూటర్లను టీఎస్ టీఎస్ మాత్రమే నిర్వహిస్తోందని , కేటీఆర్ ఆధ్వర్యంలోనే టీఎస్పీఎస్సీ( TSPSC ) రికార్డుల కంప్యూటరీకరణ జరిగిందని , కంప్యూటర్ల భద్రతపై ఐటి శాఖ సెక్యూరిటీ ఆడిట్ చేయాలని రేవంత్ డిమాండ్ చేస్తున్నారు.
కేటీఆర్ ఆఫీస్ నుంచే వ్యవహారం మొత్తం నడిచిందంటూ రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై తెలంగాణ అధికారులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో పాటు , ఆయనను విచారించారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే తనను పదేపదే టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతూ, పార్టీని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డి లకు తాజాగా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.రాజకీయ దురుద్దేశంతో తనను , ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగాల జాతరకు పాతర వేయలనే విపక్షాల కుట్రలు సాగనివ్వబోము. ఒక దురదృష్టకరమైన సంఘటనను బూచిగా చూపించి మొత్తం నియామకాల ప్రక్రియ ఆపేయాలన్నది బిజెపి కాంగ్రెస్ కుట్ర అని, మతిలేని నేతల రాజకీయ ఉచ్చుల చిక్కుకోవద్దని తెలంగాణ యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు.