రాజకీయ నాయకులకైనా, సినిమా కళాకారులకైనా ప్రదాన టార్గెట్ యువజనమే.వారి ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారు విజయ మార్గంలో ప్రయాణిస్తారు.
అధికారంలో ఉన్నవారైనా, ప్రతిపక్షంలో ఉన్నవారైనా సరే యువతను నిర్లక్ష్యం చేస్తే, వారి కోసం పథకాలు అమలు చేయకుంటే, వారికి ఉపాధి మార్గాలు చూపకుంటే రాజకీయంగా మనుగడ సాగించడం కష్టం.వైకాపా అధినేత వైఎస్ జగన్కు కూడా ఈ సంగతి బాగా తెలుసు.
అందుకే యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను చేస్తున్న పోరాటాల గురించి వివరిస్తున్నారు.
ఈమధ్య తిరుపతిలో యువజనులతో భారీ సమావేశం నిర్వహించారు.ఇది గొప్పగా విజయవంతమైందిట….! దీంతో జగన్లో ఉత్సాహం పొంగి పొర్లుతోంది.యువజనులతో భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.అందులో భాగంగా ఈ నెల (సెప్టెంబరు) ఇరవైరెండో తేదీన విశాఖపట్నంలో ‘యువభేరీ’ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.యువజనులను కలుసుకోవడం జగన్కు మంచిదే.
ఈ విషయంలో ఆయన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అనుసరిస్తున్నారని అనిపిస్తోంది.ఆయన అప్పుడప్పుడు విశ్వవిద్యాలయాలకు వెళ్లి విద్యార్థులతో సమావేశమవుతున్నారు.
జగన్ యువకుడే కాబట్టి యువజనులతో కలవడం, మాట్లాడటం చాలా సులువు.ఎంతసేపూ నిరాహార దీక్షలు, ధర్నాలు చేయడమే కాకుండా యువజనులతో కలవడం వల్ల వారి మనోభావాలు అర్థమవుతాయి.
తన ఆలోచనలు కూడా వారికి చెప్పొచ్చు.ఒక్క యువజనులతోనే కాకుండా అన్ని వర్గాలతో సమావేశం కావడం రాజకీయ నాయకుడిగా జగన్కు అవసరం.
వచ్చే ఎన్నికల నాటికి యువజనంలో మంచి స్థానం సంపాదించుకోగలిగితే అధికారానికి దగ్గరగా రావచ్చు.