ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ వానా కాల సమావేశాలు మటాష్ అయిపోయాయి.అంటే ప్రజా సమస్యల మీద చర్చలు జరగకుండానే సమావేశాలు శుక్రవారం ముగిసి పోయాయి.
ఎలాంటి చర్చ లేకుండానే కొన్ని బిల్లులు పాస్ అయిపోయాయి.పనికి మాలిన విషయాల మీద కొట్లాటలతో, తిట్లు, శాపనార్ధాలతో, చిల్లర వేషాలతో, గందరగోళంతో సభను భ్రస్టు పట్టించారు.
వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికే సభ్యులు అసెంబ్లీకి వచ్చారు.ఏపీ అసెంబ్లీని చూస్తే వీళ్లు ప్రజా ప్రతినిదులేనా అనే అనుమానం కలుగుతోంది.
వై కా పా అధినేత జగన్ నోటుకు వోటు కేసు విషయంలో చివరి రోజు కూడా పట్టు విడవకుండా గొడవ చేసారు.నోటుకు వోటు పై చర్చ జరగాలని డిమాండ్ చేసి వాయిదా తీర్మానం ఇచ్చారు.
స్పీకర్ కోడెల దీన్ని తిరస్కరించి మరో రూపంలో చర్చకు రావాలని చెప్పినా వినలేదు.పోడియం లోకి దూసుకు పోయి నినాదాలు చేసారు.
దీంతో సభను రెండు సార్లు వాయిదా వేసారు.మళ్ళీ సభ ప్రారంభమైనా అదే దృశం రిపీట్ అయింది.
విసుగు చెందిన స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేసారు.తెలంగాణాకు సంబంధించిన నోటుకు వోటు కేసుపై ఆంధ్రా అసెంబ్లీలో ఎందుకు చర్చ జరపాలో జగనుకే తెలియాలి.
ఆయనకు ప్రజా సమస్యల కంటే చంద్రబాబు వ్యక్తిగత కేసు ఎక్కువై పోయింది.ఈ కేసుతో ప్రజలకు సంబంధం ఉందా? ఆడియో టేపుల్లో గొంతు మీది అవునో కాదో చెప్పండి? ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ దగ్గరకు మీరు పంపారా, లేదా చెప్పండి? అని చంద్రబాబును జగన్ నిలదీయడం ఏమిటో అర్ధం కావడంలేదు.కేసు కోర్టులో ఉన్నప్పుడు దాన్ని గురించి అసెంబ్లీలో ఎందుకు వివరణ ఇవ్వాలి? జగన్ దీనిపై పట్టుబట్టి అసెంబ్లీ సమావేశాలను ఎందుకు మటాష్ చేయాలి? ఏపీ అసెంబ్లీ సమావేశాలు పార్లమెంటు సమావేశాల మాదిరిగానే వాషవుట్ అయ్యేలా ఉందని తెలుగు స్టాప్ వెలిబుచ్చిన అనుమానం నిజం అయింది.







