కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు.ఇదివరలో ఆయన ఒకసారి ఆదిలాబాదు జిల్లాలో పర్యటించి, పాదయాత్ర చేసి కాంగ్రెసు నాయకులకు ఉత్తేజం కలిగించారు.
ఆ ఉత్తేజం తగ్గిందనుకున్నారో, లేదా మరింత ఉత్సాహం నింపాలని నిర్ణయించుకున్నారోగాని మళ్లీ పర్యటించబోతున్నారు.ఈ నెల (ఆగస్టు) ఇరవై ఒకటో తేదీగాని, ఇరవై రెండో తేదీన గాని తెలంగాణలో రాహుల్ పర్యటన ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
పర్యటన వివరాలు తరువాత తెలియచేస్తామన్నారు.గతంలో ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మహారాష్ర్ట నుంచి నేరుగా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు.
అక్కడ పాదయాత్ర ముగించుకొని, సభలో మాట్లాడి వెళ్లిపోయారు.హైదరాబాదుకు వచ్చి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సమావేశం నిర్వహిస్తారని, వారితో ముఖాముఖి మాట్లాడతారని కాంగ్రెసు నాయకులు చెప్పినా అది జరగలేదు.
అయితే ఈసారి పర్యటనలో యువరాజు హైదరాబాదుకు రాబోతున్నారని సమాచారం.ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు విద్యార్థులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి విశ్వవిద్యాయంలో రాహుల్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయించాలని కోరారు.
కాబట్టి ఈసారి తప్పక వస్తారని అనుకుంటున్నారు.ఈమధ్యే ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటించిన రాహుల్ అక్కడి కాంగ్రెసు నాయకులకు పార్టీ కార్యక్రమాలపై సూచనలు ఇచ్చారు.
అన్ని రాష్ర్టాల్లో మాదిరిగానే అక్కడ కూడా రైతుల సమస్యలపై మాట్లాడారు.ఏపీలో ప్రత్యేక హోదా పెద్ద సమస్యగా మారింది కాబట్టి దాన్ని గురించి ప్రధానంగా ప్రస్తావించారు.
కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేలా కనబడటంలేదు కాబట్టి దానిపై ఉద్యమం నిర్వహించాలని రాష్ర్ట కాంగ్రెసును ఆదేశించారు.తెలంగాణలో ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటారో చూడాలి.







