ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి జూన్ ఆరో తేదీన శంకుస్థాపన చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకోగా, మరో పక్క కొన్ని గ్రామాల వారు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వబోమని భీష్మిస్తున్నారు.బలవంతంగా భూములు సేకరించాలనే సర్కారు యోచనకు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కేపిటల్ రీజియన్ డెవెలప్మెంట్ అథారిటీ (క్రిడా) పరిధిలోని ఉండవల్లి, నిడమర్రు, పెనుమాక, మరి కొన్ని గ్రామాల వారు నలభై ఎనిమిది గంటల నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు.భూములు ఇవ్వాలని రైతులను ఎందుకు బలవంతం చేస్తున్నారని ప్రభుత్వాన్ని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే ముప్పయ్మూడు వేల ఎకరాల భూమి సేకరించింది.ఇప్పటివరకు సేకరించిన భూమిలోనే రాజధాని నిర్మాణం చేయాలని, ఇంకా భూములను బలవంతంగా తీసుకునేందుకు ఎందుకు ప్రయత్నాలు చేయాలని రైతులు ప్రశ్నించారు.
రాజధాని నిర్మాణానికి పచ్చటి పంట పొలాలను, ఏడాదికి మూడు పంటలు పండే భూములను సేకరించారని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుత రాజధాని నిర్మాణ ప్రాంతం వాస్తు ప్రకారం బాగుందని పండితులు చెప్పడంతో చంద్రబాబు దాన్ని ఎంపిక చేశారు.
ఆయనకు వాస్తు ప్రధానంగాని పంట పొలాలు కావు కదా…!
.






