ఏ నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేసినా మూడు నాలుగు రోజుల తరువాత పోలీసులు బలవంతంగా ఎత్తేసి ఆస్పత్రిలో చేరుస్తారు.సినిమా హీరో శివాజీ విషయంలోనూ బుధవారం ఇదే జరిగింది.
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేస్తూ గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు శివాజీ.ప్రత్యేక హోదా ఇచ్చేదాకా తన దీక్ష కొనసాగుతుందని ప్రకటించాడు.
ఆయన దీక్షకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, వామపక్షాలు సహా అనేక ప్రజా సంఘాలు మద్దతు పలికాయి.ఈ మూడు రోజులు బాగానే కలకలం రేగింది.
ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటంలేదని అనేకమంది దుయ్యబట్టారు.దీక్ష ఈ రోజుకు నాలుగో రోజుకు చేరుకుంది.
శివాజీ ఆరోగ్యం కూడా కాస్త క్షీణించిందేమో.మూడు రోజులు తమాషా చూసిన ప్రభుత్వం ఆయన్ని ఎత్తి ఆస్పత్రిలో పడేయమని పోలీసులకు చెప్పినట్లుంది.
వారు వెంటనే దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు.తన దీక్ష భగ్నం చేస్తే రైలు కింద తలపెడతానని, సెల్ టవర్ ఎక్కుతానని, దాన్ని అడ్డుకుంటే బస్సు కింద పడతానని…ఇలా రకరకాలుగా శివాజీ పోలీసులను హెచ్చరించాడు.
ఆ పనులు జరిగేవి కాదని ఆయనకూ తెలుసు, పోలీసులకు తెలుసు.శివాజీ దీక్ష భగ్నం చేసినప్పుడు ఆయన మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు.
అయినా తరలించారు.దీక్ష భగ్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని కిరోసిన్ బాటిళ్లు పట్టుకొని కూర్చున్న మహిళలు ఏమయ్యారో మరి.నిరాహార దీక్షల సమయంలో ఇలా ‘రక్తి’ కట్టిస్తుంటారు.దీక్ష చేసేవారికి కూడా పోలీసులు వచ్చి ఆస్పత్రికి తీసుకుపోతే బాగుండును అనిపిస్తుంది.
ప్రాణత్యాగం చేయడానికి ఇది పొట్టి శ్రీరాములు కాలం కాదు కదా…! శివాజీ ఆస్పత్రిలో ఏం చేస్తాడో చూడాలి.