తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రోజు రోజుకు బలం పెంచుకుంటూ పోతుంది.సార్వత్రిక ఎన్నికల్లో సెంటిమెంట్తో గెలిచిన తెరాస వచ్చే ఎన్నికల్లో అసలైన బలాన్ని చూపేందుకు సిద్దం అవుతోంది.
జిల్లాల్లోని ఇతర పార్టీల నాయకులను బెదిరించి, బుజ్జగించి తమ పార్టీలోకి వచ్చేలా చేసుకోవడంలో టీఆర్ఎస్ పార్టీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.ప్రతీ జిల్లాలో కూడా ఇతర పార్టీల నుండి భారీగా నాయకులు మరియు కార్యకర్తలు తరలి వచ్చారు.
దాంతో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తాజాగా నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ఈ విషయం తేలిపోయింది.
తెలంగాణలో ఈ పార్టీకి ఏకంగా అరకోటి సభ్యత్వాలు నమోదు కావడం చర్చనీయాంశం అయ్యింది.మొత్తం పది జిల్లాల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేసిన టీఆర్ఎస్ పార్టీ 50 లక్షల పై చిలుకు సభ్యులుగా చేరడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ అంచనాల మేరకు 30 లక్షలు సభ్యత్వాలు నమోదు అవుతాయని భావించారు.కాని అనూహ్యంగా మరో 20 లక్షలు అదనంగా సభ్యులు చేరారు.
అధికార పార్టీకి సభ్యత్వాల సంఖ్య పెరగడం మామూలే.కాని టీఆర్ఎస్కు పెరిగిన ఈ సంఖ్య రాజకీయ విశ్లేషకులను సైతం విశ్మయానికి గురి చేస్తోంది.
పరిస్థితి ఇలాగే ఉంటే 2019లో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం అంటున్నారు.








