నల్లగొండ జిల్లా: క్రీడలు ఓటమిని తట్టుకునే శక్తిని,జట్టుగా గెలుపొందే పట్టుదలను, మానసిక,శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని నల్లగొండ డిఎస్పీ కె.శివరాంరెడ్డి అన్నారు.
బుధవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సారథ్యంలో పోలీస్ స్టేషన్ స్థాయిలో పూర్తి చేసుకుని, అందులో ఎంపిక కాబడిన క్రీడాకారులకు నల్లగొండ సబ్ డివిజనల్ స్థాయిలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఎన్జీ కళాశాలలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతాయని,అదే విధంగా క్రీడలను అలవాటుగా చేసుకుంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకులను,అనుకోని పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం వస్తుందని,అదే విధంగా ఓటమిని కూడా కసితో,పట్టుదలతో ప్రయత్నించి గెలుపుకు నాందిగా మలుచుకోగలుగుతారని,
జట్టుగా కలిసి ఓటమిని జయించే దృఢత్వం పెరుగుతుందని తెలిపారు.
యువత చెడు వ్యసనాల బారిన పడుతున్నారని,చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యల దాకా వెళ్తున్నారని,మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నారని,అదే క్రీడలను మన రోజువారి చర్యలో భాగంగా చేసుకుంటే ప్రతి విషయానికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరని,క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని సూచించారు.ఈ కార్యక్రమంలో నల్గొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,నల్గొండ టూ టౌన్ సీఐ రాఘవరావు,శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి,ట్రాఫిక్ సిఐ రాజు,ఉమెన్ పోలీస్ స్టేషన్ సిఐ కరుణాకర్,నల్గొండ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు,నల్గొండ వన్ టౌన్ ఎస్ఐలు శంకర్,సందీప్ రెడ్డి,కనగల్ ఎస్ఐ విష్ణు, పీఈటీలు,పిడిలు గిరిబాబు, బాలరాజు,సత్యనారాయణ,శంభు ప్రసాద్,సబ్ డివిజన్లోని 14 పోలీస్ స్టేషన్ల పరిధిలోని క్రీడాకారులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.