ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila )రాజకీయ అడుగులు తప్పటడుగులుగానే కనిపిస్తున్నాయి.తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించి రాష్ట్రమంతటా పాదయాత్ర నిర్వహించారు.
పదే పదే వైయస్సార్ పేరును ప్రస్తావిస్తూ తెలంగాణలో మళ్లీ వైఎస్ పాలన తీసుకువస్తానని ప్రచారం చేసుకున్నారు.అయితే పెద్దగా పేరున్న నేతలు ఎవరూ షర్మిల పార్టీలో చేరకపోవడం, ఎన్నికల సమయంలో ఆమె వ్యవహరించిన తీరు , సొంత పార్టీ నేతల్లోనూ ఆమె రాజకీయంపై నమ్మకం లేకపోవడం తదితర పరిణామాలతో పెద్దగా ఆ పార్టీలో చేరికలు చోటు చేసుకోలేదు.
ఇక ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తన గెలుపు నల్లేరు మీద నడకని భావించారు కానీ, చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు.వెంటనే ఢిల్లీకి( Delhi ) వెళ్లి కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ముందుగా తాను పూర్తిగా తెలంగాణ లోనే ఉంటానని, ఇక్కడే రాజకీయం చేస్తానని, తాను ఇక్కడే పెరిగానని తాను తెలంగాణ కోడలినని ఎన్నో మాటలు చెప్పిన షర్మిల చివరకు అక్కడి కాంగ్రెస్ నేతల అభ్యంతరాలు ఒత్తిడితో ఏపీ కాంగ్రెస్ కు షిఫ్ట్ అయ్యారు.

వైసిపి పైన , జగన్( Jagan ) పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం కూడా షర్మిల ద్వారా జగన్ ను ఇరుకున పెట్టాలని భావించిన ఆమెకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలను అప్పగించారు.షర్మిల ద్వారా జగన్ ను, వైసీపీని( YCP ) ఇరుకున పెట్టాలని భావించినా, మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడం, కడప ఎంపీగా పోటీ చేసినా షర్మిల కూడా ఓటమి చెందడం, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం, ఏపీ కాంగ్రెస్ పైన ప్రభావం చూపిస్తున్నాయి.ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది .భవిష్యత్తులో కోలుకుంటుంది అన్న నమ్మకమూ ఆ పార్టీ నేతల్లో కనిపించడం లేదు.

2029 ఎన్నికల్లో సత్తా చాటుతామని షర్మిల చెబుతున్నా. అప్పటికి కాంగ్రెస్ బలోపేతం అవుతుందన్న నమ్మకం కూడా కనిపించడం లేదు.ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో టిడిపి , వైసిపి తప్ప మరో పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఎన్నికలకు వెళ్లి అధికారం దక్కించుకునే పరిస్థితి లేదు .ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే ఆ పార్టీలు కాస్తో కూస్తో సీట్లను సాధించుకునే పరిస్థితి ఉంది .ఈ నేపద్యంలో ఏపీలో కాంగ్రెస్ బలపడి అధికారంలోకి వస్తుందన్న నమ్మకమూ జనాల్లోనూ, ఆ పార్టీ నాయకుల్లోను లేకపోవడం వంటివన్నీ షర్మిల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి.