రాజన్న సిరిసిల్ల జిల్లా: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీరుతానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.ఆయా ఆలయాల అభివృద్ధి పై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిశానన్నారు.
అవసరమైతే ఆయనను సైతం ఎములాడకు తీసుకొచ్చేందుకు క్రుషి చేస్తానన్నారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణకాశీ వేములవాడకు విచ్చేసిన నేపథ్యంలో ఎములాడ రాజరాజేశ్వర ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఇంకా పెరిగిందన్నారు.
ఎములాడ రాజన్నతోపాటు కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ప్రకారం కసితో పనిచేస్తున్నానని తెలిపారు.
వేములవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితం పట్టణంలో మున్నూరుకాపు సంఘం భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ… ‘‘జై శ్రీరామ్ అనేటోల్లు నిజమైన మున్నూరు కాపులు.ఇయాళ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం సంతోషంగా ఉంది.
సంఘ భవన నిర్మాణం కోసం నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తా’’నని హామీ ఇచ్చారు.‘‘మీరంతా కష్టపడి పనిచేసినందుకే నేను గెలిచి మంత్రి ని అయ్యాను.
నా గెలుపుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారు.నాకు భారీ మెజారిటీ అందించిన వేములవాడ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తా.
స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తా’’అని తెలిపారు.నేను అన్ని కుల సంఘాలకు నిధిలిచ్చిన.
దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను కుల సంఘాల బాధ్యతలు అప్పగించాలి.పొరపాటున పార్టీలు జొరబడితే కుల సంఘాలు చీలే ప్రమాదముంది.
అందరి సహకారంతో కుల సంఘాలు అభివృద్ధి కావాలి.అని పేర్కొన్నారు.