రాజన్న సిరిసిల్ల జిల్లా : ఏడాది నుంచి 19 ఏండ్లలోపు వయసు పిల్లలు, విద్యార్థులందరికీ అల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు.నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చందుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అల్బెండజోల్ మాత్రలు అందజేశారు.
అనంతరం స్కూల్ లోని తరగతి గదులు పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు.వంటగది లో మెనూ పరిశీలించి, సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను చూసి, వంట చేస్తున్న వారితో మాట్లాడారు.
విద్యాలయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎంత మంది విద్యార్థులు ఉన్నారో ఎస్ఓ కల్పన ను అడిగి తెలుసుకున్నారు.విద్యాలయం ఆవరణ పరిశీలించి, దానిని శుభ్రం చేయించాలని, విద్యార్ధినుల కోసం ఆట స్థలం సిద్ధం చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు.
నూతన భవనం త్వరగా పూర్తి చేయాలి
చందుర్తిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతన భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.అనంతరం పీహెచ్ సీ లోని మందుల గది, రక్త పరీక్షల గది, ఇన్వార్డ్ ను పరిశీలించారు.
సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు, యాంటి వీనం, రెబీస్ నివారణ అందుబాటులో ఉన్నాయా? అని మెడికల్ ఆఫీసర్ సంపత్ ను అడిగి తెలుసుకున్నారు.కంటి వైద్య పరీక్షలు చేసే గదిని పరిశీలించారు.
దవాఖానకు రోజూ ఎంత మంది రోగులు వస్తున్నారని వివరాలు తెలుసుకున్నారు.ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉండాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రతలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను కలెక్టర్ ఆదేశించారు.
ఇక్కడ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.