రాజన్న సిరిసిల్ల జిల్లా : కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని త్వరగా తరలించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuraag Jayanti ) ఆదేశించారు.చందుర్తి మండలంలోని మర్రిగడ్డ, మల్యాల, రుద్రంగి మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆయా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఎంత దిగుబడి వచ్చింది? ఖరీఫ్ లో ఎంత? యాసంగిలో ఎంత దిగుబడి వచ్చిందో అడిగి తెలుసుకున్నారు.
కొనుగోలు కేంద్రాల వసతుల పై ఆరా తీశారు.వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు.మర్రిగడ్డ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలు, ధాన్యం కాంటాలు, తేమ యంత్రాలు, రిజిస్టర్లు తనిఖీ చేశారు.ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు ఉన్నాయా లేవా అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ ఆరా తీశారు.
అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని సూచించారు.
లారీల సంఖ్యను పెంచాలని, రైస్ మిల్లుల్లో అన్ లోడింగ్ త్వరితగతిన చేయాలని ఆదేశించారు.రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.
ఇక్కడ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్లు శ్రీనివాస్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.