నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా రూ.29 లకే భారత్ రైస్( Bharat Rice ) పేరుతో సన్నబియ్యం ప్రజలకు అందుబాటులోకి తెస్తానని ప్రగల్భాలు పలికిన మోడీ సర్కార్,రేషన్ షాపుల్లో ఉచితంగా ఇచ్చే దొడ్డు బియ్యాన్నే సంచుల్లో నింపి భారత్ రైస్ అని ముద్రవేసి మార్ట్ ల ద్వారా రూ.29 లకు ప్రజలకు అంటగడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని ఒక ప్రముఖ మార్ట్ లో భారత్ రైస్ ను అమ్మకాలు చేపట్టారు.
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రతిష్టత్మాకంగా తీసుకోని వచ్చిన భారత్ రైస్ పథకానికి ఆకర్షితులై ఎగబడి కొనుగోలు చేశారు.ఇంటికెళ్లి ఎంతో సంతోషంతో ఈ కరువు కాటకాల సమయంలో భారత్ రైస్ మన ఊరికి తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వానికి ధన్యవాదములు కూడా చెప్పారు.
వారికి ఆ సంతోషం ఎంతో సేపు నిలువ లేదు.బియ్యం సంచి విప్పగానే సన్న బియ్యం బదులుగా దొడ్డు బియ్యం కనిపించేసరికి ఇంటిల్లిపాది షాకయ్యారు.
అయితే బియ్యం కొనుగోలు చేసేటప్పుడే మార్ట్ యాజమాన్యం ప్రభుత్వం తమకు ఇచ్చింది,మేము మీకు ఇస్తున్నాం.తిరిగి వాపసు తీసుకోబడవని కండిషన్ తో అమ్మకాలు జరిపారు.
దీనితో చేసేదేమీలేక మోసపోయామని తెలుసుకొని,తమ లాగా ఇంకొకరు మోసపోవద్దని భారత్ రైస్ బాధితులుశనార్తి తెలంగాణను ఆశ్రయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ రైస్ పేరుతో మోడీ సర్కార్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 6 న తీసుకొచ్చిన రూ.29 లకే సన్నబియ్యం పథకం పెద్ద బోగస్ అని మండిపడ్డారు.పేద,బడుగు,బలహీన వర్గాలను ముంచే పథకమని,నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మంచి సన్నబియ్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఇవే బియ్యం రేషన్ షాప్ లో కూడా ఉన్నాయని,వాటినే పాలిష్ చేసి భారత్ రైస్ గా అమ్ముతున్నారని,దేశంలో బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావాలని మొదలు పెట్టినట్టు చెప్పి మోసం చేసి,కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ఆలోచనతో 29 రూపాయలకే సన్నబియ్యం అందిస్తామని ప్రకటించి,5 కేజీల,10 కేజీల సంచుల్లో బియ్యన్ని దేశ వ్యాప్తంగా విక్రయించడం అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు.ఇకనైనా కేంద్ర ప్రభుత్వం హంగు,ఆర్భాటాలు మాని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా దొడ్డుబియ్యం బదులు సన్నరకం బియ్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు.