యాదాద్రి భువనగిరి జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ నిరుపయోగంగా మారింది.గతంలో ఆలయ పునరుద్ధరణలో భాగంగా లక్షల రూపాయలు వెచ్చించి కొండపైకి వెళ్లే రోడ్డు మార్గంలో భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు మరియు గాట్ రోడ్డు ప్రాంతమంతా సుందరంగా ఉండేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.
గతంలో 2021లో అధికారులు ప్రారంభించిన వాటర్ ఫౌంటెన్ వద్ద ఆహ్లాదకర వాతావరణ పరిసరాలలో భక్తులు ఫోటోలు దిగుతూ, సేదతీరుతూ గార్డెన్ లలో విశ్రాంతి తీసుకుంటూ కనిపించేవారు.సాయంకాల సమయాలలో రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో శోభాయమానంగా తలపించే అద్భుతమైన వాటర్ ఫౌంటెన్ నిరుపయోగంగా మారడం గమనార్హం.
ఇప్పటికైనా ఆలయ ఈవో భాస్కరరావు స్పందించి నిరుపయోగంగా ఉన్న వాటర్ ఫౌంటెన్ తిరిగి పునఃప్రారంభించి,గార్డెన్ పరిసరాలలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు విశ్రాంతి తీసుకుని, సేదతీరేలా చూడాలని కోరుతున్నారు.







