రాజన్న సిరిసిల్ల జిల్లా :ఓటరు జాబితా పక్కాగా రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీ, చనిపోయిన వారి ఓట్ల తొలగింపును కలెక్టర్ అనురాగ్ జయంతి గురువారం గంభీరావుపేటలోని 61,62,63 పోలింగ్ స్టేషన్ల (పీఎస్)పరిధిలో ఓటర్ జాబితా ఇంటి నంబర్ల వారీగా స్వయంగా తనిఖీ చేశారు.
ఓటర్ల ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించి, ఆన్లైన్, వాటి వివరాలను తనిఖీ చేశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లు ఉండకూడదని స్పష్టం చేశారు.
జాబితా నుంచి ఓటరును తొలగించే ముందు బీ.ఎల్.ఓ.లు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి పరిశీలించిన పిదప మాత్రమే తొలగించాలని, ఓటర్ల పూర్తీ వివరాల పై అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు.బూత్ స్థాయి అధికారులను తహసిల్దార్ లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని, రోజు ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.ఇంటింటి సర్వే నిర్వహించి పోలింగ్ కేంద్రాల వారిగా ఉన్న ఇండ్ల సంఖ్య, సర్వే చేసిన ఇండ్లు, కొత్తగా నమోదు చేయాల్సిన ఓటర్లు, శాశ్వతంగా తొలగించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటరు కార్డు లో సవరణలు మొదలగు అంశాల పై నివేదికలను ఈ.ఆర్.ఒ నెట్ ద్వారా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా సేకరించిన వివరాలను బి.ఎల్.ఓ యాప్ లో నమోదు చేసేలా చూడాలని అన్నారు.ఓటరు జాబితా లో ఒక ఇంటిలో 6 కంటే అధికంగా ఓట్లు ఉంటే ప్రత్యేకంగా పరిశీలించి ధృవీకరించాలని కలెక్టర్ సూచించారు.
ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు అందరూ ఒకే పోలింగ్ స్టేషన్ లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ వెల్లడించారు.
ఈ పర్యటన లో స్థానిక తహసీల్దార్ భూపతి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, ఎం.పి.డి.ఓ .రాజేందర్ , బి.ఎల్.ఓ .లు , తదితరులు పాల్గొన్నారు.







