సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామానికి చెందిన కందుల వినయ్ తండ్రి వెంకటేశ్వర్లు,పుల్లెంల అనిల్ తండ్రి లింగయ్య అనే ఇద్దరు వ్యక్తులు టి.లైఫ్ ఇన్స్యూరెన్స్( T.Life Insurance ) పేరిట వివిధ ప్రాంతాల్లోని అమాయక ప్రజలను మోసం చేసి సుమారు రూ.30 కోట్లు కొట్టేసినట్లు బాధితులు చెప్పడంతో భారీ ఇన్సూరెన్స్ దందా జిల్లాలో వెలుగు చూసింది.ఆ ఇద్దరి కేటుగాళ్లతో విసిగివేసారిన బాధితులుసోమవారం మీడియా ముందుకు వచ్చిన తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకున్నారు.ఆరోగ్యం బాగా లేనివారిని,2 లేదా 3 నెలల్లో చనిపోయే వారికి రూ.లక్ష ఇన్స్యూరెన్స్ చెల్లిస్తే మరణించిన వారికి 9 నెలల 25 రోజులకు రూ.6 లక్షలు వస్తాయని అమాయకులను నమ్మబలికి,ఏజెంట్లను నియమించుకోని డబ్బులు తీసుకున్నారని,నమ్మకం కోసం చెక్కులు,ప్రాంసారి నోట్లు రాసిచ్చారని, ఎన్నిసార్లు అడిగినా ఇన్సూరెన్స్ పట్టాలు ఇవ్వకుండా,కట్టిన డబ్బులు ఇవ్వకుండా గత కొన్నేళ్లుగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
మరికొన్ని చోట్ల రూ.5 లక్షలకు రూ.కోటి,మరి కొన్నిచోట్ల రూ.16 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని ఆశచూపి,పేద ప్రజల్ని ఆసరాగా చేసుకొని భారీ మోసానికి తెరలేపారని బాధితులు వాపోయారు.వారిమాటలు నమ్మి అప్పులు చేసి మరీ ఇన్సూరెన్స్ చేశామని, ఇప్పుడు అసలు ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఫోన్ లో అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరిస్తున్నారని, ఇన్సూరెన్స్ ( Insurance )రాక,కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వక, అప్పులు పెరిగిపోతూ అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని తమ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు.