సూర్యాపేట జిల్లా: లింగ బేధం లేకుండా విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ ఇవ్వాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యు సూర్యాపేట డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట డిపో మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు.నేతలు పుల్లూరి సింహాద్రి, పిడమర్తి భరత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ అహంకారం, నియంతృత్వం తారస్థాయి చేరడం, విద్యార్థి, నిరుద్యోగుల ప్రజల సమస్యలను గాలికొదిలేడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తాము అధికారంలోకి వస్తే పేద,మధ్యతరగతి విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన రకాల వసతులు,సౌకర్యాలు కల్పిస్తామని విసృతంగా తమతమ వేదికల్లో, మ్యానిఫెస్టోలో ప్రచారం చేశారు.
అది నమ్మిన ప్రజలు విద్యార్థులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని పేర్కొన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు విపరీతంగా ఉండడంతో అవి తగ్గించాలని వివిధ సందర్భాల్లో విద్యార్థులు ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు.
నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా విద్యార్థులందరికి ఉచితంగా బస్ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రహీం,మహేష్, నవీన్,గోపి,వినయ్ తదితరులు పాల్గొన్నారు.