అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి రిపబ్లికన్ పార్టీ( Republican Party ) అభ్యర్ధుల 4వ ప్రెసిడెన్షియల్ డిబేట్ అలబామా యూనివర్సిటీ వేదికగా బుధవారం వాడీవేడిగా జరిగింది.దీనిలో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ,( Nikki Haley ) వివేక్ రామస్వామిలతో( Vivek Ramaswamy ) పాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ , న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రీస్టీ పాల్గొన్నారు.
ఎప్పటిలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి కూడా చర్చకు డుమ్మా కొట్టారు.ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ వార్ , అమెరికా దక్షిణ సరిహద్దు వంటి జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభ్యర్ధుల మధ్య వాడి వేడి చర్చ జరిగింది.

మిగిలిన వారి సంగతి పక్కనబెడితే.మరోసారి నిక్కీ హేలీని పర్సనల్గా టార్గెట్ చేశారు వివేక్ రామస్వామి. ఆమె అవినీతిపరురాలని, విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.కార్పోరేట్ సంస్థల నుంచి డబ్బులు తీసుకుని ప్రసంగాలు చేస్తున్నారని వివేక్ సంచలన ఆరోపణలు చేశారు.డెమొక్రాటిక్ పార్టీకి విరాళాలు ఇచ్చే దాత రీడ్ హోఫ్మన్( Reid Hoffman ) అనే బిలియనీర్ నుంచి నిక్కీహేలీ అమె కుటుంబ సభ్యులు 2.5 లక్షల డాలర్లు పొందారని వివేక్ వ్యాఖ్యానించారు.దీంతో నిక్కీ హేలీ ఒక దశలో సైలెంట్గా వుండిపోయారు.

ఈ నేపథ్యంలో నిక్కీ హేలీ తరపున మరో అభ్యర్ధి క్రిస్ క్రిస్టీ( Chris Christie ) స్పందించారు.వివేక్ పబ్లిసిటీ కోసం మాట్లాడే వ్యక్తని, ఉక్రెయిన్పై అమెరికా విధానంపై రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూభాగాన్ని వదిలేయడమే యుద్ధానికి ముగింపుగా వివేక్ గతంలో వ్యాఖ్యానించారని క్రిస్టీ విరుచుకుపడ్డారు.
నిక్కీ హేలీ తెలివైన, అనుభవజ్ఞురాలైన నేత అని ఆమెను అవమానించడం ఆపాలంటూ క్రిస్టీ కౌంటరిచ్చారు.కాసేపటికీ వివేక్ చేసిన వ్యాఖ్యలకు స్పందించడానికి ఇది తగిన సమయం కాదని నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు.







