టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది.
ఈ మేరకు 16వ కోర్టులో ఐటమ్ నంబర్ 64 కింద ఈ కేసు లిస్ట్ అయింది.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో బెయిల్ ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం 21న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించిందని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఆరోపించారు.
హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందన్న లాయర్లు చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరారు.మినీ ట్రయల్ నిర్వహణ జరిగిందనడానికి 39 పేజీల తీర్పు నిదర్శనమని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో తేలేంత వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది.