తెలంగాణలో కాంగ్రెస్( Telangana congress ) మంచి జోష్ మీద ఉంది.అధికారంలోకి వస్తామనే నమ్మకం ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది .
దీనికి తగ్గట్లుగానే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.ప్రధాన పోటీ అంతా బిఆర్ఎస్ , కాంగ్రెస్ ల మధ్య అన్నట్లుగా ఉండడం, బిజెపి ప్రభావం అంతంతమాత్రంగానే ఉండడంతో, కాంగ్రెస్ విజయం పై ధీమాగా ఉంది.
దీనికి తోడు రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంటుందని, అది తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడానికి కారణమైన వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేయడం, ఆరు ప్రధాన హామీలు ప్రజల్లోకి వెళ్లడం ఇవన్నీ తమకు విజయాన్ని సాధించి పెడతాయి అని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను పోటీ చేస్తున్న కొడంగల్ , కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు , రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటన చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
కాంగ్రెస్ లో చాలామంది స్టార్ క్యాంపెనర్లు ఉన్నా, వారెవరు ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆసక్తి చూపించడం లేదు.
కేవలం తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు ఎక్కువగా పరిమితం అవుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార బాధ్యతలు అన్ని రేవంత్ రెడ్డి పైనే పడ్డాయి .దీంతో రేవంత్ కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారం ఊపందుకుంది.అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సైతం పరోక్షంగా తానే ముఖ్యమంత్రి కాబోతున్నానని , తొలి సంతకం ఫలానా ఫైలు మీదే పెడుతున్నానని ప్రకటించడంతో రేవంత్ సీఎం పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారని, అధిష్టానం కూడా రేవంత్ మొగ్గు చూపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది .అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అనుసరించిన పద్ధతులు చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా, రేవంత్ సీఎం పదవి కచ్చితంగా వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది.

కొద్ది నెలల క్రితం కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉంటూ రాష్ట్రమంతా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించి అంతా తానే ముందుకు నడిపించిన డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి వస్తుందని అంతా భావించారు .కానీ సీఎల్పీ లీడర్ గా ఉన్న సిద్ధరామయ్యకి సీఎం పదవిని కట్టబెట్టి సీనియర్టికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. డీకే శివకుమార్ అప్పట్లో అసంతృప్తికి గురికాగా , ఆయనకు మరోసారి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది .అయితే తెలంగాణలోనూ అదే విధంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలు కాబోతోంది .దీంతో కాంగ్రెస్ తన పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఉన్నా, బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

ఆ విధంగా చూస్తే సీఎల్పీ నేత మల్లు భట్టు విక్రమార్క( Mallu Bhatti Vikramarka )కే సీఎం ఛాన్స్ ఉండొచ్చనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. అలా కాకుండా సీనియారిటీ, సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) తో పాటు , చాలామంది నేతల పేర్లనే పరిగణలోకి తీసుకోవచ్చు.కర్ణాటకలో కాంగ్రెస్ ఫార్ములా అనుసరించి తెలంగాణలోనూ సీఎం అభ్యర్థిని ఎంపిక చేస్తే, రేవంత్ కు ఛాన్స్ దక్కే అవకాశం ఉండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







