భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రజల్లో పరిణితి రాలేదని కేసీఆర్ అన్నారు.ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలు గెలిచినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు.కొందరి మోసపూరిత హామీలను నమ్మొద్దన్న కేసీఆర్ కళ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని చెప్పారు.
గతంలో తాగు, సాగునీటి కష్టాలు, కరెంట్ కోతలతో పాటు వలసలు ఉండేవన్నారు.అయితే బీఆర్ఎస్ వచ్చాక పద్ధతిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఒక్క తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంట్ వస్తోందని పేర్కొన్నారు.సీతారామ ప్రాజెక్టు పనులు 75 శాతం పూర్తయ్యాయన్న కేసీఆర్ ఏడాదిలోపు ఖమ్మంలోని పది నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.