రాజన్న సిరిసిల్ల జిల్లా: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి – 9 లో భాగంగా నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్ ను ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ( Anurag Jayanthi )ఆదేశించారు.త్వరలో ఈ జలాశయంను సిఎం కేసిఆర్ ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ) తో కలిసి కొనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ ను క్షేత్ర స్థాయిలో సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి -9 లో భాగంగా నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్ పూర్తయిందని, ఇదివరకే ట్రయల్ రన్ లో భాగంగా రెండు పంపులు సక్సెస్ అయ్యాయని తెలిపారు.
ఈ రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుందని, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని ( Vemulawada )రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.
హెలిప్యాడ్ సిద్ధం చేయాలని, కంట్రోల్ రూమ్, పైలాన్ ను ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని అన్నారు.ప్రాజెక్టు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.అంతకముందు నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కలెక్టర్, ఎస్పీ సందర్శించారు.ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అన్నారు.
ఈ సందర్శనలో అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ నాగేంద్ర చారి, ఎస్డీసీ గంగయ్య, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, డీఈ లు, తదితరులు ఉన్నారు
.






