చేరికలపైనే తెలంగాణ కాంగ్రెస్ భారీగా ఆశలు పెట్టుకుంది.బీఆర్ఎస్ ( BRS ), బిజెపి లకు ధీటుగా పార్టీని అధికారం వైపు నడిపించాలంటే ఇతర పార్టీలోని బలమైన నేతలు వచ్చి చేరితేనే అది సాధ్యమవుతుందని నమ్ముతోంది.
ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ బలోపేతం కావడం, ఇతర పార్టీలలోని కీలక నేతలంతా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపే చూస్తూ ఉండడం, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవన్నీ కలిసి వస్తున్నాయని , రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.ఇప్పటికే టికెట్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినా… కీలక నేతలు వచ్చి చేరితే వారికి టిక్కెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమనే సంకేతాలు పంపిస్తుండడంతో, కాంగ్రెస్ లో చేరేవారు ఎక్కువగానే కనిపిస్తున్నారు .సెప్టెంబర్ 17న కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉండబోతున్నట్లుగా, ఆ పార్టీ కీలక నాయకులు ప్రకటిస్తున్నారు.సోనియాగాంధీ సమక్షంలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు చెబుతున్నారు.
సెప్టెంబర్ 17న కాంగ్రెస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది.

సభ వేదికపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ( Sonia Gandhi ) రాహుల్, ప్రియాంక గాంధీ లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించనున్నారు.ఇదే వేదికపై బీజేపీ , బీఆర్ఎస్ లలోని కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి .ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ( Revanth Reddy )సమావేశం అయ్యారు.సెప్టెంబర్ 17న సోనియా సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు .ఇక మల్కాజ్ గిరి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడితో కలిసి అదే రోజు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ నుంచి బిజెపి( BJP party )లోకి వెళ్లిన కీలక నేతలు కొంతమంది కాంగ్రెస్ లో చేరేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం .ఎవరూ ఊహించిన విధంగా బీఆర్ఎస్, బిజెపిలలోని కీలక నాయకులు ఎంతోమంది కాంగ్రెస్ లో చేరబోతున్నారని , వారి పేర్లను బయటకు వెల్లడించమని కాంగ్రెస్ కీలక నాయకులు చెబుతున్నారు.దీంతో సెప్టెంబర్ 17న ఏ స్థాయిలో కాంగ్రెస్ లోకి చేరికలు ఉండబోతున్నాయి అనేది అందరికీ ఆసక్తికరంగా మారగా , కాంగ్రెస్ ఈ చేరికలపైనే భారీగా ఆశలు పెట్టుకుంది.







