సమాజంలో రోజురోజుకు దారుణాలు, మోసాలు పెరిగిపోతున్నాయి.కష్టపడకుండా సంపాదించడం కోసం అడ్డదారులలో వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.
మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు కూడా మోసాలు, దారుణాలు చేయడంలో తమ ప్రతిభను చూపిస్తున్నారు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఈ కోవలోనే విమానంలో వచ్చి బెంగుళూరులో దిగి, వస్త్ర దుకాణాలలో షాపింగ్ పేరుతో అత్యంత ఖరీదైన చీరలను దోపిడీ చేసే ఖతర్నాక్ కిలాడీల ముఠాను ఆదివారం అశోక్ నగర పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముఠాకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.గుంటూరు జిల్లాకు ( Guntur District )చెందిన చుక్కమ్మ, రత్నాలు, రమణి ( Chukkamma, Ratnalu, Ramani )అనే ముగ్గురు మహిళలు ఏపీ నుంచి బెంగుళూరుకు విమానంలో వచ్చి స్కార్పియో కారులో బెంగుళూరు నగరంలో సంచరించేవారు.అతిపెద్ద ధనవంతులు లాగా కనిపించడం కోసం ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి, స్కార్పియో కారులో బెంగుళూరు నగరంలో ఉండే అతిపెద్ద వస్త్ర దుకాణాల ముందు దిగుతారు.
చూసేవారందరూ ఎంత పెద్ద ధనవంతులో అనుకుంటారు.చీరలు కొనుగోలు చేసే నెపంతో సిబ్బంది కళ్ళుగప్పి విలువైన చీరలను మాయం చేయడంలో బాగా ఆరితేరారు.సిబ్బంది ఎన్ని చీరలు చూపించిన ఇంకా చూపించాలని అడిగేవారు.

సిబ్బంది చీరలు తేవడానికి షాప్ లోపల ఉండే స్టోర్ రూమ్ లోకి వెళ్ళిన సమయంలో చీరల బండిల్స్ ను దాచుకొని అక్కడినుండి నెమ్మదిగా జారుకునేవారు.అయితే ఇటీవలే షాపు నుండి బయటకు వెళ్తున్న ఈ ముఠాలోని ఓ మహిళ కాలి వద్ద చీర ఉన్నట్లు గమనించిన షాపు సెక్యూరిటీ ఆ విషయం యజమానికి తెలిపాడు.షాప్ యజమాని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించగా ఈ మహిళల భాగోతం వెలుగులోకి వచ్చింది.
వెంటనే షాప్ యజమాని సీసీటీవీ ఫుటేజ్ లతో సహా అశోక్ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ మహిళల ముఠాను ఆదివారం అరెస్టు చేసి వీరి వద్ద నుంచి రూ.14 లక్షల విలువైన చీరలను స్వాధీనం చేసుకున్నారు.







