దేశ వ్యాప్తంగా నిత్యావసరాలు మరియు టమాటా ధరల పెరుగుదలపై కేంద్రం స్పందించింది.ధరల పెరుగుదలకు పంట సీజన్ మార్పు, కర్ణాటకలో పంటకు తెగులుతో పాటు ఉత్తర భారత్ లో ఒక్కసారిగా రుతు పవనాల ప్రవేశం, వర్షాలు కారణమని కేంద్రం తెలిపింది.
దేశీయంగా ఉత్పత్తి తగినంత లేకపోవడంతో పాటు దిగుమతి చేసుకోవడం కారణంగా కందిపప్పు ధర పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఎరువులు, పురుగు మందుల హోల్ సేల్ ధరల సూచి, ద్రవ్యోల్బణం గత ఏడాది కంటే తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు.
ఉల్లి, పప్పు దినుసులను బఫర్ స్టాక్ నుంచి విడుదల చేస్తూ ప్రభుత్వం ధరలను నియంత్రిస్తోందని వెల్లడించారు.అదేవిధంగా అక్రమ నిల్వలకు ఆస్కారం లేకుండా నిఘా పెట్టామని తెలిపారు.
నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా ఆహార పదార్ధాలను పంపిణీ చేస్తున్నామన్నారు.తద్వారా దేశంలోని సుమారు 80 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆమె చెప్పారు.
భారత్ దాల్ పేరుతో సబ్సిడీపై శనగపప్పును మార్కెట్ లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని లోక్ సభలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు.







