నల్లగొండ జిల్లా: అజ్ఞాత సూర్యుడు, ప్రతిఘటన ఉద్యమ దళపతి,ఆదివాసి ముద్దుబిడ్డ,సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ లింగన్న 4వ వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో కామ్రేడ్ లింగన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ(ఎం ఎల్)న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్ మాట్లాడుతూ 2019 జులై 31 న కామ్రేడ్ లింగన్నను పోలీసులు పట్టుకొని,చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని తెలిపారు.
కామ్రేడ్ లింగన్న ఆదివాసీ,గిరిజన,పేద ప్రజల సమస్యలపై,వారి హక్కుల కోసం అలుపెరుగని పోరాటాన్ని నిర్వహించాడని కొనియాడారు.
వేల ఎకరాల పోడు నరికించి భూమిలేని పేద ప్రజలకు పంచి పెట్టారని అన్నారు.
ఆదివాసి గూడాల నుండి ప్రజలను వెళ్లగొట్టి అడవిలోనే ఖనిజ సంపదను,దోచుకుని, సామ్రాజ్యవాదులకు బడా పెట్టుబడిదారులకు అప్పగించడానికి పాలక ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయని,ఈ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన లింగన్న ప్రజలను ఏకం చేసి ప్రతిఘటించాడని అన్నారు.అందుకే కసాయి పోలీస్ మూకలు కామ్రేడ్ లింగన్నను బూటకపు ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపినారని ఆవేదన వ్యక్తం చేశారు.
లింగన్నను చంపితే వేలాది లింగన్నలు పుట్టుకొస్తారని,లింగన్న మరణానంతరం ప్రజలు చేసిన ప్రతిఘటన మనకందరికీ మార్గదర్శకమన్నారు.భూమి,బుక్తి,విముక్తి కోసం,లింగన్న చూపిన ప్రతిఘటన పోరాటంలో ప్రజలంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి బొంగరాల నర్సింహా, బొమ్మిడి నగేష్, పి.డి.ఎస్.యు.జిల్లా అధ్యక్షుడు నూనె సురేష్,నాయకులు జనపాటి శంకర్,రావుల వీరేశ్,చింతల వెంకట రమణ,దాసరి నర్సింహా, మామిడాల ప్రవీణ్, ఇందూరు మధు తదితరులు పాల్గొన్నారు.