నల్లగొండ జిల్లా: రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న ఆర్ధిక సహాయం తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని పూర్తి సబ్సిడీతో అందచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు,రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తద్వారా మైనార్టీల ఆర్థిక స్వావలంబన దిశగా దేశానికే ఆదర్శవంతమైన మరో చారిత్రక ఘట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని, మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని పునరుద్ఘాటించారు.
విద్య, ఉపాధి సహా పలురంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగుతున్నదన్నారు.ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్ఫలితాలను అందిస్తున్నదని అన్నారు.