జిల్లాలో కార్మిక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో భవన మరియు ఇతర నిర్మాణ రంగా కార్మికులకు అన్యాయం జరుగుతుందని వెల్ఫేర్ బోర్డు దరఖాస్తు చేసుకున్న వేల క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్న వాటిని పరిష్కరించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని దీనికి నిరసనగా జులై ఏడున కలెక్టరేట్ ముందు జరిగే మహా ధర్నా( Chalo Collectorate Maha Dharna )ను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం( సిఐటియు అనుబంధం)( CITU ) జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అనంతల మల్లయ్య అధ్యక్షత జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు కార్మిక శాఖ కార్యాలయాలు ఉన్నాయని,ఇవి విచ్చలవిడిగా దళారులకు మరియు అవినీతి పరులకు అడ్డాలుగా నిలుస్తున్నాయని ఆరోపించారు.
వీటిని అరికట్టేందుకు ఉన్నత అధికారుల దృష్టికి పలుసార్లు తీసుకువెళ్లి సాక్ష్యాలతో పలు వినతి పత్రాలు ఇచ్చినా ఉన్నత అధికారులు దృష్టి సారించకపోవడం మూలంగా కార్మిక శాఖ అధికారులు కార్యాలయాల సిబ్బంది వైఖరి మారడం లేదన్నారు.ఇలాంటి పరిస్థితులలో కార్మికులంతా ఏకమై జులై 7న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం( Suryapet Collector Office ) ముందు మహాధర్న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దీనిపై సమగ్ర విచారణ జరిపి అవినీతి అధికారులను వారి సిబ్బందిని సస్పెండ్ చేయాలని పెండింగ్ క్లైములను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాంబాబు,నెమ్మాది వెంకటేశ్వర్లు,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి లకావత్ బాలాజీ నాయక్, సోమపంగు రేణుక,జెడ్.సుజాత,జిల్లా కమిటీ సభ్యులు షేక్ సత్తార్, మాగి లింగయ్య,ఉపతల వెంకన్న,జంజనం కోటేశ్వరరావు,ఒగ్గు సైదులు,వేముల రాములు,గంట వెంకన్న, మల్లెపాక నగేష్, సోమపంగు వీరబాబు, రమేష్,శేఖర్,అజయ్, నరహరి తదితరులు పాల్గొన్నారు.