సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం రాయినిగూడెం సహకార సంఘంలో చోరీ జరిగి 15 రోజులు కావస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక దాగి ఉన్న ఆంతర్యమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం అఖిలపక్ష నాయకులు రైతులతో కలిసి మిర్యాలగూడ కోదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.అనంతరం అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రాయినిగూడెం పిఎసిఎస్ పాలకవర్గాన్ని రద్దు చేసి బ్యాంక్ సీఈఓని తొలగించాలని డిమాండ్ చేశారు.
సహకార సంఘం కుంభకోణంపై తక్షణమే విచారణ జరిపి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
బ్యాంకులో చోరీ జరిగినట్లు గుర్తించిన అధికారులు విచారణలో ఎందుకు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే దొంగలను గుర్తించి చోరీ డబ్బులను రికవరీ చేయాలని,సహకార సంఘం చైర్మన్,సీఈవో పాలకవర్గంపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం పోలీసుల హామీతో ధర్నా విరమించారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, రైతులు,రైతు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.