ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన తర్వాత ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటికైనా ఖమ్మం కేంద్రంలో ఐటిడిఏ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంజారా భవన్ లో జరిగింది గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘం అధ్యక్షుడు భూక్య వీరబద్రం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజన తర్వాత నూతనంగా ఏర్పాటు అయిన జిల్లాల్లో ఐటీడీఏలను జిల్లాలో ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నదని అన్నారు.
మైదాన ప్రాంతంలో గిరిజనులు గణనీయంగా ఉన్న అన్ని జిల్లాల్లో ప్రత్యేక ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదని విమర్శించారు.జిల్లాల విభజన జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్న ఐటీడీఏ వంటి గిరిజన పరిపాలన సంస్థలను విడదీసి ఆయా జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని విమర్శించారు.
గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు.
గిరిజనులు గణనీయంగా ఉండి, ఐదో షెడ్యూల్ ప్రాంత మండలాలున్న ఖమ్మం జిల్లాలో ఇంతవరకు ఐటిడి ఏర్పాటు చేయకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం ,విద్యా ,ఉపాధి,రుణాలు వంటి సమస్యలపై సుదూర ప్రాంతంలో ఉన్న భద్రాచలం ఐటీడీఏకు వెళ్ళవలసి వస్తుందని అన్నారు.తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో 140 తండాలు, గూడాలు ఉండగా మిగిలిన మైదాన ప్రాంతంలో 176 తండాలు ఉన్నాయని, జిల్లాలో మూడు లక్షల మందికి పైగా గిరిజనులు నివసిస్తున్నారని తెలిపారు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఖమ్మం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయకపోవడంతో గిరిజనులకు పరిపాలన పరమైన సమస్యలతో పాటు సంక్షేమ అభివృద్ధి అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార పార్టీ యంత్రాంగం స్పందించి ఐటిడి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారవత్ రాంమూర్తి నాయక్ సేవాలాల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోతు కిషన్ నాయక్ తెలంగాణ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బోడ వీరన్న నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు బస్కినాయక్ మాట్లాడుతూ జిల్లా నుంచి గిరిజన విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలతో పాటు పోడు భూముల సమస్యలపై భద్రాచలం వెళ్లాలంటే చాలా దూరం ఉండటంతో గిరిజనులు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నదని అన్నారు.జిల్లాలో గిరిజన విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నదని, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన కాలేజీ హాస్టల్స్ లో కనీస సదుపాయాలు లేవని వీటిని పర్యవేక్షించే గిరిజన అధికార యంత్రాంగం లేకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతున్నదని అన్నారు.
గిరిజన తండాలు, గూడాలలో త్రాగునీరు రోడ్లు కరెంటు వంటి మౌలిక సదుపాయాలకు సబ్ ప్లాన్ నిధులు కూడా ఖర్చు చేయలేని దుస్థితి జిల్లాలో నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.గత మూడు సంవత్సరాలుగా ఐటిడిఏ లేకపోవడంతో జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని ,ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో జరిగిన సంఘం జిల్లా నాయకులు ముఖ్య కృష్ణ నాయక్ మూడు గన్యా నాయక్ గుగులోత్ కుమార్ నాయక్ బాధావత్ శ్రీనివాస్ నాయక్ భూక్యా రమేష్ ,జ్యోతి భూక్యా బాలాజీ, అజ్మీరా కిషన్ నాయక్ గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు బానోతు రాందాస్, భూక్యా శోభన్ బాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ఐటీడీఏ సాధన కమిటీ చైర్మన్ గా దారవత్ రాంమూర్తి ఎన్నిక కాగాభూక్యా వీరభద్రం- కన్వీనర్, బానోతు కిషన్ నాయక్ -వైస్-ఛైర్మాన్ , బోడ వీరన్న నాయక్ -కో-కన్వీనర్ , బానోతు బస్కీ నాయక్ -వైస్- చైర్మన్, ధర్మసోతు రామునాయక్ – కో-కన్వీనర్, భిక్షపతి రాథోడ్ -కో-కన్వీనర్, బానోతు బాలాజీ -కమిటీ సభ్యులు, బాదవత్ సైదులు నాయక్ – కమిటీ సభ్యులు, బానోతు చంద్రం నాయక్, భూక్యా కృష్ణ నాయక్, ముడ్ గన్యా నాయక్, గుగులోత్ కుమార్ నాయక్, జ్యోతి బాయ్, బానోతు నాగేశ్వరరావు లు తదితరులు ఎన్నికైన వారిలో ఉన్నారు.