సూర్యాపేట జిల్లా: కేంద్రంలోని మినీ ట్యాన్క్ బండ@సద్దుల చెరువును అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు.ఈ మేరకు ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు రూపు దిద్దుకుంటున్నాయని వెల్లడించారు.
గురువారం ఉదయం రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్,మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణమ్మ,ఆడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ హేమంత్ కేశవ్ పాటిల్,సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి లతో కలసి ఆయన సద్దుల చెరువును సందర్శించారు.మినీ ట్యాన్క్ బండ్ లో పర్యాటకుల విహారం కోసం త్వరలో బోట్ షికారును ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే టూరిజం బోట్ లు మినీ ట్యాన్క్ బండ్ కు చేరుకున్నాయన్నారు.అంతే గాకుండా ట్యాన్క్ బండ్ మధ్యలో పుట్టిన రోజు,పెళ్లి రోజు లాంటి శుభకార్యాల ఏర్పాటు కోసం మినీకృయిజ్ షిప్ ఫైబర్ జెట్ లను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
దానికి తోడు ప్రత్యేకించి వాకర్స్ కోసం మెడిటేషన్ కేంద్రంతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.దానికి తోడు చిన్నారుల కోసం సృజనాత్మకతకు అద్దం పట్టే రీతిలో క్రీడా కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయికనుగుణంగా నిర్మాణాలతో పాటు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ముఖద్వార నిర్మాణాలు చేపట్ట బోతున్నట్లు వివరించారు.