బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Thalasani Srinivas Yadav ) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )మధ్య గత కొద్ది రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన విమర్శలకు అంతే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు.
అయితే రేవంత్ చేసిన విమర్శలపై యాదవ సంఘాలు ఫైర్ అయ్యాయి.తమ సామాజిక వర్గం పై రేవంత్ చేసిన విమర్శలకు వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని, లేకపోతే గాంధీ భవన్( Gandhi Bhavan ) ను ముట్టడిస్తామని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
తలసాని శ్రీనివాస్ యాదవ్ దున్నపోతులను కాసేవాడని, పేడ పిసుక్కునే వాడని రేవంత్ చేసిన వ్యాఖ్యలు యాదవులను అవమానించినట్లేనని పేర్కొంటూ, రేవంత్ క్షమాపణ చెప్పాలని , లేకపోతే దున్నపోతులతో, గొర్రె పొట్టేళ్లతో గాంధీభవన్ ముట్టడిస్తామని గొల్ల కురుమల పోరాట సమితి హెచ్చరించింది.

దీనిపై తాజాగా కాంగ్రెస్ కీలక నేతలంతా స్పందించారు.రేవంత్ రెడ్డి యాదవులను కించపరచలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్( Anjan Kumar Yadav ) అన్నారు.మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన విమర్శలకు రేవంత్ సమాధానం ఇచ్చారని , ఎక్కడా యాదవుల గురించి ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదట రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారని , ఆయనను పిసికేస్తానని కామెంట్లు చేశారని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.గాంధీభవన్ ముట్టడిస్తామని వారు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాంధీభవన్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.బీఆర్ఎస్ పేరుతో ఆ నాయకులు చేస్తున్నది పొలిటికల్ టూరిజం అంటూ మల్లు రవి మండిపడ్డారు.

తల పొగరుతో తలసాని చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తే యాదవులకు అంటగట్టి కుల రాజకీయాలు చేస్తున్నారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్( Addanki dayakar ) అన్నారు.గాంధీభవన్ జోలికి వస్తే తెలంగాణ భవన్ ను పేల్చేస్తామని అద్దంకి దయాకర్ హెచ్చరించారు.ప్రియాంక గాంధీ సభ తర్వాత కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని, అందుకే ఈ తరహా కుల రాజకీయాలకు జర లేపారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు.ప్రస్తుతం రేవంత్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ కీలక నాయకులంతా ఒక్కొక్కరుగా స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.







