యూకేలో వున్న పంజాబీ ఎన్ఆర్ఐలకు ఎయిరిండియా( Air India ) శుభవార్త చెప్పింది.పంజాబ్లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అమృత్సర్ నుంచి యూకేలోని గాట్విక్కు ఎయిరిండియా డైరెక్ట్ ఫ్లైట్ను ప్రారంభించింది.
ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీ నుంచి వర్చువల్గా విమానాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.
కొత్త అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీ ఈ ప్రాంత అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు.పంజాబ్ నుంచి లక్షలాది మంది ప్రజలు యూకేలో నివసిస్తున్నారని .కొత్త సర్వీసు ఇరు దేశాల్లోని కుటుంబాలను అనుసంధానం చేస్తుందని జ్యోతిరాదిత్య సింధియా ఆకాంక్షించారు.
ఎయిరిండియా సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ మాట్లాడుతూ.
తన ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా భారత్లోని ప్రధాన నగరాలు, ప్రపంచ గమ్యస్థానాల మధ్య కనెక్టివిటీని గణనీయంగా పెంచాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే తాము యూరప్లోని ప్రధాన నగరాలైన కోపెన్హెగన్, మిలన్, వియన్నాలకు సర్వీసులను పున: ప్రారంభించినట్లు సీఈవో పేర్కొన్నారు.
18 బిజినెస్ క్లాస్, 238 ఎకానమీ క్లాస్ టికెట్లతో కూడిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అమృత్సర్ నుంచి సోమ, గురు, శనివారాల్లో వారానికి మూడు సార్లు గాట్విక్( Gatwick )కు నడుస్తుందని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే ఎయిరిండియా భారత్లోని అహ్మదాబాద్, గోవా, కొచ్చి నగరాల నుంచి కూడా గాట్విక్కు మరో 9 సర్వీసులను నడుపుతోంది.మొత్తంగా ఎయిరిండియా యూకేకు వారానికి 49 విమానాలను నడుపుతోంది.ఇందులో లండన్కు 43 విమానాలు (హీత్రో, గాట్విక్) బర్మింగ్హామ్కు ఆరు వున్నాయి.అలాగే ఢిల్లీ, ముంబైల నుంచి హీత్రూ, లండన్లకు వీక్లీ స్పెషల్గా 31 విమానాలను నడుపుతోంది.
కాగా.ఈ నెల ప్రారంభంలో జ్యోతిరాదిత్య సింధియాతో పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్( Kuldeep Dhaliwal ) భేటీ అయిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా కెనడా, అమెరికాలకు పంజాబ్ నుంచి నేరుగా విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని ధాలివాల్ కోరారు.
ఈ మేరకు జ్యోతిరాదిత్య సింధియాకు ఆయన వినతిపత్రం అందజేశారు.కెనడా, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ , చికాగో, సీటెల్, శాన్ఫ్రాన్సిస్కోలకు . అమృత్సర్, మొహాలీల నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ నడపాలని కుల్దీప్ విజ్ఞప్తి చేశారు.ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఇరువైపులా ప్రయాణీకులు భారీగా లబ్ధిపొందుతారని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.